Friday, May 17, 2024

ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా తెలంగాణ.. వైద్యోపకరణాల తయారీలో ముందంజ: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ వరల్డ్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వైద్యోపకరణాల తయారీ, పరిశోధనల కోసం #హదరాబాద్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైస్‌ పార్కులో స#హజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీ(ఎస్‌ఎంటీ) సంస్థ ఏర్పాటు చేసిని ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్‌ తయారీ యూనిట్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ప్రాజెక్టు సంజీవని పేరుతో స్టెంట్ల తయారీ యూనిట్‌ను ఎస్‌ఎంటీ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘కరోనాతో ప్రపంచం వెనుకబడినా ఎస్‌ఎంటీ వేగం తగ్గలేదు. తమ యూనిట్‌ను అనతికాలంలోనే కంపెనీ నిర్మాణం పూర్తి చేసింది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ, పరిశోధన సంస్థ ఎస్‌ఎంటీ అని కొనియాడారు.

దేశంలో మెడికల్‌ డివైసెస్‌ తయారీతో ఔషధాలు, వైద్యోపకరణాల ధరలు తగ్గాయి. బయో ఆసియా సదస్సులో వైద్యోపకరణాల తయారీ సంస్థలను కలిశానని గుర్తు చేశారు. దేశంలో 80 శాతం వైద్యోపకరణాలు విదేశాల నుంచి తెస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఇక్కడ వైద్య పరికరాలు తయారు చేయాలనుకున్నప్పటికీ కొన్ని రకాల ముడి పదార్థాలను ఇప్పటికీ చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం మేకిన్‌ ఇండియా అని చెప్పడం కాదు. వైద్య పరికరాల తయారీకి కేంద్రం మరిన్ని సానుకూల విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మెడ్‌టెక్‌ కంపెనీలకు తెలంగాణలో అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పటికే సుల్తాన్‌పూర్‌ వైద్య పరికరాల పార్కుకు రూ.1500 కోట్ల పెట్టుబడులువచ్చాయి.. మరిన్ని రాబోతున్నాయి. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విరివిగా వైద్య పరికరాల తయారీతో ఆరోగ్య రంగం మరింత పటిష్టం అవనుంది’ అని కేటీఆర్‌ తెలిపారు. ఎస్‌ఎంటీ స్టెంట్‌ తయారీ యూనిట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహజానంద్‌ గ్రూప్‌ చైర్మన్‌ ధీరజ్‌లాల్‌ కొటాడియా, ఎంపీ కొత్తప్రభాకర్‌ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, టీఎస్‌ఐఐసీ ఎండీ ఇవిఎన్‌రెడ్డి, లైఫ్‌సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తినాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎంటీ యూనిట్‌ ద్వారా 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు…

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలంలోని సుల్తాన్‌పూర్‌, దాయర గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన మెడికల్‌ డివైజెస్‌ పార్కులో రూ.250 కోట్లతో సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎంటీ) పరిశ్రమ స్టెంట్ల ఉత్పత్తిని చేపట్టింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏటా 1.2 మిలియన్ల కార్డియాక్‌ స్టెంట్లు, 2 మిలియన్ల కార్డియాక్‌ బెలూన్లు ఉత్పత్తి చేయనున్నారు. వద్ధుల కోసం టీఏవీఐ, పిల్లలు, గుండె రంధ్రం ఉన్న వారి కోసం ఆక్టూడర్‌ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి స్టెంట్లు తయారు చేస్తారు. గుండె సంబంధిత బాధితులకు వేసే స్టెంట్లు ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దీంతో రోగులపై ఆర్థికంగా భారం పడుతున్నది. ఇప్పుడు ఈ సంస్థ ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనుండటంతో తక్కువ ధరకు స్టెంట్లు లభిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement