హైదరాబాద్ సిటీ నలుదిశలా ఐటీని విస్తరిస్తామని, ఈ దిశ ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఉప్పల్లో జెన్ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. జెన్ ప్యాక్ట్ను వరంగల్లోనూ విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. హైద్రాబాద్ తూర్పు ప్రాంతాన్ని విస్తరించేందుకు నాగోల్ లో శిల్పా రామాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉప్పల్ లోనే ఉందన్నారు.
పశ్చిమ హైద్రాబాద్ కు దీటుగా తూర్పు హైదరాబాద్లో కూడా అభివృద్దిని విస్తరిస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ ప్రాంతంలో IT కంపెనీలతో పాటు రియల్ ఏస్టేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రైవేట్ డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందన్నారు. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ ప్రాజెక్టును కండ్లకోయలో ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఐటీ పార్క్ ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ నెల 17న ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడి నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు 45 నిమిషాల్లో చేరుకొనే అవకాశం ఉంటుంది. కండ్లకోయ వద్ద జంక్షన్ వద్ద స్థల ఎంపిక పూర్తి కావడంతో నిర్మాణ ప్రణాళికను సర్కార్ సిద్దం చేసింది. ఈ బాధ్యతలను టీఎస్ఐఐసీకి అప్పగించింది.