Thursday, April 25, 2024

భారత్‌కు స్టార్టప్‌లు వెన్నెముక.. నూతన ఆవిష్కరణలు కీలకం: మోడీ

న్యూఢిల్లి : భారతదేశంలోని స్టార్టప్‌లు దేశానికి వెన్నెముకగా నిలుస్తాయని ప్రధాని మోడీ అన్నారు. జనవరి 16న నేషనల్‌ స్టార్టప్‌ డేగా జరుపుకోబోతున్నామని ప్రకటించారు. స్టార్టప్‌లకు మేలు చేసే విధంగా దేశంలో నియమాలను సైతం మార్చనున్నట్టు పేర్కొన్నారు. స్టార్టప్‌ ప్రపంచంలో భారత పతకాన్ని ఎగురవేస్తున్న వారందరికీ మోడీ అభినందించారు. స్టార్టప్‌లకు సంబంధించి కేంద్రం కూడా పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నదని మోడీ పేర్కొన్నారు. దేశంలోని స్టార్టప్‌లకు ఊతం ఇచ్చేందుకు ప్రధాని మోడీ శనివారం 150 స్టార్టప్‌ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో ఎంటర్‌ప్రైజ్‌ సిస్టమ్స్‌, స్పేస్‌, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, ఫిన్‌టెక్‌, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం లాంటి పలు రంగాలకు చెందిన 150కు పైగా స్టార్టప్‌ ప్రతినిధులతో సంభాషించారు. స్టార్టప్‌ల అభివృద్ధి, ఆర్థికపరమైన చేయూత, ప్రభుత్వ సాయం, భవిష్యత్తు సాంకేతికత, ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపే అంశాలపై ప్రధాని మోడీ సంభాషించారు.

2015లో గ్లోబల్‌ ఇండెక్స్‌ ర్యాంకు 81 ఉండగా.. ఇప్పుడు 46వ స్థానానికి చేరుకుందన్నారు. 2013-14లో 4వేల స్టార్టప్‌లు మాత్రమే ఉండగా.. ఈ సంఖ్య 28వేలకు చేరిందన్నారు. దేశం కోసం నూతన ఆవిష్కరణలు చేద్దామంటూ నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దీని కోసం జిల్లా స్థాయిలో కొత్త స్టార్టప్‌లు రావాలంటూ మోడీ సూచించారు. యువత మరిన్ని ఆలోచనలు చేసి ప్రపంచంలో భారత్‌ పేరును అగ్రగామిగా నిలపాలని మోడీ సూచించారు. దేశంలో సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాలు ప్రస్తుతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు స్టార్టప్‌లను సంప్రదించాలన్నారు. స్టార్టప్‌ల స్వర్ణ కాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమైందన్నారు. ఆవిష్కరణలకు సంబంధించి భారత్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌లో మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement