Wednesday, May 15, 2024

పన్ను బకాయిల వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌.. మే 1 నుంచి జూన్‌ 30 వరకు చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వాణిజ్య పన్నుల పురోగతితో రాష్ట్ర ఖజానా నిండుతుండగా, మరోవైపు కోట్లాది రూపాయల పన్ను ఎగవేతలు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో పన్ను ఎగవేతలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రముఖ సంస్థలే ప్రత్యేకంగా పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లుగా వెల్లడి కావడంతో దిద్దుబాటు దిశగా ప్రయత్నాలు ఆరంభించింది. ప్రత్యేకంగా పలువురు డిప్యూటీ కమిషనర్లతో వీటికి చెక్‌ పెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. 11 రంగాల్లో సేవా పన్ను వసూలు బాధ్యతలను ప్రత్యేకంగా కమిటీకి బాధ్యతలను అప్పగించారు. వ్యాట్‌, జీఎస్‌టీ, సీఎస్‌టీ, ఎంట్రీ పన్నుల వసూళ్లు, పెండింగ్‌లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.

జీఎస్‌టీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యాట్‌ సీఎస్‌టీ వంటివి అమలులో లేవు. అయితే జీఎస్‌టీ రాకకు పూర్వం కొంతమేర పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇలా మిగిలిపోయి పెండింగ్‌లో ఉన్న రూ.3600 కోట్లు రాబట్టుకోవ డంతోపాటు, మొండి బకాయిలను సెటిల్‌ చేసుకోవాలని యోచి స్తోంది. గతేడాది అమ్మకం పన్నుల రాబడి రూ.26,803 కోట్లు రాగా, జీఎస్‌టీ రూ.31,641 కోట్లు వసూలైంది. ప్రస్తుత ఏడాది అంచనాలను అమ్మకం పన్ను ఆదాయాన్ని రూ.33 వేల కోట్లకు, జీఎస్‌టీని రూ.36,203 కోట్లకు పెంచుకున్నారు. వచ్చేనెల 1నుంచి జూన్‌ చివరివరకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకాన్ని అమలులోకి తెచ్చి బకాయిలు వసూలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జులై 1నుంచి ఆగస్టు వరకు వివాదాలు పరిష్కరించుకునేందుకు సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో వీలు కల్పించనున్నారు. వ్యాట్‌ బకాయిదారులు 11,440 మంది, సీఎస్‌టీ బకాయిపడిన 12,680 మందికి జరిమానా మినహాయించడంతోపాటు అసలులోనూ రిబేటు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రికార్డులను ముందేసుకున్న డీసీలు అనేక వివరాలను ఆరా తీస్తున్నారు. అక్రమాలను వెలుగులోకి తెస్తూ నోటీసులు జారీ చేయనున్నారు. ఆయా సంస్థల్లో తనిఖీలతో అక్రమార్కులపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది.

దాదాపు 11 రంగాల్లో వివిధ సంస్థలు దాదాపు రూ.1000 కోట్ల మేర పన్నులు ఎగవేశారని ప్రాథమికంగా గుర్తించారు. లావాదేవీలు, పన్ను చెల్లింపులను పరిశీలిస్తున్న అధికారులు కీలక చర్యలకు దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. తాజాగా ఇలాంటి అక్రమాల్లో భాగంగా సేవాపన్ను చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డ కొందరికి ఇప్పటికే నోటీసులిచ్చినట్లు తెలిసింది. ఏసీ బస్సులపై ఐదు శాతం సర్వీస్‌ టాక్స్‌ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే అనేక సంస్థలు ఈ సేవా పన్నును చెల్లించడంలేదని సమాచారం. బ్యాంకులు, బీమా సంస్థలు, టెక్స్‌టైల్స్‌, విమానయాన, డిస్టిలరీలు వంటివి సేవా పన్నును సక్రమంగా చెల్లించడంలేదని గుర్తించారు. 2017 జులై 1నుంచి 2018 మార్చి 31 వరకు ఆయా సంస్థల టర్నోవర్‌, పన్ను మదింపు వివరాలను డీసీలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఎగవేతలను గుర్తిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement