Thursday, May 16, 2024

కాంగ్రెస్ ఏం చేసిందో మీ నాన్నను అడగండి: కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేని పనిని.. తాము చేసి చూపిస్తున్నామని కేటీఆర్ నిన్న ట్వీట్ చేశారు. తాజాగా ఆ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రి కేటీఆర్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘‘కేటీఆర్.. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎంతగా పాటుపడిందో పాపం మీకు తెలియదేమో. కాంగ్రెస్ చేసిందేంటో మీ నాయన కేసీఆర్ ను అడగండి చెబుతారు. అయినా, రైతుల సమస్యలను పరిష్కరించకుండా రాజకీయం చేయడంలో ఆయన బిజీగా ఉండి ఉంటారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ‘స్వరాష్ట్ర’ కలను సాకారం చేసింది కాంగ్రెస్సే. మేము రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చాం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తెచ్చాం. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 7 వేల మంది రైతులను పొట్టనబెట్టుకుంది. బీజేపీతో కుమ్మక్కయి రాజకీయ క్రీడలో రైతులను పావులుగా చేశారు. రాష్ట్రంలో కనీసం ఐకేపీ సెంటర్లు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తోంది.’’ అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో రైతుల ఎదుగుదల కోసం విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చామని రేవంత్ పేర్కొన్నారు. హరిత విప్లవం, వ్యవసాయ భూ పరిమితి చట్టం, భూమి లేని పేదలకు భూమి (అసైన్డ్ ల్యాండ్స్) ఇవ్వడం, కనీస మద్దతు ధర వంటి వాటిని అమలు చేశామని రేవంత్ తెలిపారు. నిత్యావసర సరుకుల చట్టం, రేషన్ పంపిణీ వ్యవస్థ, రూ.70 వేల కోట్ల మేర రైతులకు రుణ మాఫీ, ఉపాధి హామీ పథకం, సమగ్ర పంట బీమా, ఆహార భద్రత వంటి పథకాలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని రేవంత్ గుర్తు చేశారు. ‘’మీరేం బాధపడకండి కేటీఆర్. అన్ని విషయాల్లోనూ మీ లాంటి ప్రభుత్వాలను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆర్టీఈ, ఆర్టీఐ వంటి వాటినీ కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చింది’’ అంటూ రేవంత్ సెటైర్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement