Friday, May 3, 2024

డి 9 గ్యాంగ్ ను వదిలే ప్రసక్తే లేదు – రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ముఖ్యమంత్రి కేసిఆర్, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ తో పాటు సోమేశ్ కుమార్, జయేశ్ రంజన్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లు, మరో ఇద్దరు ఐఏఎస్‌లు, టోటల్‌గా డీ9 గ్యాంగ్ కలిసి తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తున్నారని తెలంగాణ పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 20 శాతం భూమిని రాసిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అనుమతులు ఇచ్చేస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. ఈ భూ దందా వెనకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ పార్క్ అయిన కేబీఆర్ పార్క్ చుట్టూ అక్రమ నిర్మాణాల కోసం నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు.

కేబీఆర్ పార్క్ సమీపంలో గతంలో నిర్మాణాలు ఈ స్థాయిలో లేవని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే పెరిగాయని ఆయన పేర్కొన్నారు. కేబీఆర్ పార్క్ సమీపంలో వున్న పురాతన భవనాన్ని కూలగొట్టి.. అక్కడ భారీ అపార్ట్‌మెంట్ కట్టడానికి అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందుకోసం ఓ పత్రిక యజమానికి 2700 గజాల స్థలాన్ని రాయించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ పత్రిక అసలు ఓనర్ కేసీఆరేనని ఆయన పేర్కొన్నారు. కేబీఆర్ పార్క్ , బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు వున్నాయని రేవంత్ చెప్పారు. ఇక్కడ నాలుగు నుంచి ఐదు అంతస్తుల భవనాలు కట్టడానికే అనుమతులు వున్నాయని ఆయన తెలిపారు. 21 అంతస్తుల అపార్ట్‌మెంట్ వల్ల ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతుందని.. అంతేకాకుండా, అక్కడే పెట్టే ఏసీల వల్ల కేబీఆర్ పార్క్‌కు వచ్చే అరుదైన పక్షుల మనుగడ ప్రమాదంలో పడుతుందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజాం కాపాడిన నగరాన్ని కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement