Monday, April 29, 2024

లారీ డ్రైవ‌ర్ల క‌ష్టాలు తెలుసుకునేందుకు.. ట్ర‌క్ లో ప్ర‌యాణించిన రాహుల్ గాంధీ

లారీ డ్రైవ‌ర్ల క‌ష్టాల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు ట్ర‌క్కులో ప్ర‌యాణించారు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఈ మేర‌కు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి చండీగఢ్ బయలుదేరారు. ఈ క్రమంలో అంబాలా దగ్గర తన కారును ఆపి ట్రక్కు డ్రైవర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ ఓ ట్రక్కు ఎక్కారు. ట్రక్కులో రాహుల్ గాంధీ ప్రయాణించడం చూసి హైవేపైన వెళుతున్న మిగతా వాహనాలలోని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారులో ప్రయాణిస్తున్న కొంతమంది దీనిని రికార్డు చేసి ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ట్రక్ డ్రైవర్లు ఎదుర్కుంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే రాహుల్ గాంధీ ఇలా ప్రయాణం చేశారని చెప్పారు. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే ఇలాంటి పనిచేయగలరని, పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని ఆయన తపన పడుతుంటారని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి వ్యాఖ్యానించారు. షిమ్లాలో ఉంటున్న తన సోదరి ప్రియాంక గాంధీ కుటుంబాన్ని కలుసుకునేందుకే రాహుల్ గాంధీ ఈ ప్రయాణం పెట్టుకున్నారని పార్టీ వర్గాలు వెల్ల‌డించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement