Friday, May 3, 2024

కేంద్రం వెన్నుపోటు.. కేసిఆర్ వెన్నుదన్ను: మంత్రి పువ్వాడ

తెలంగాణ రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి ధాన్యం కొనుగోలు చేయకపోతే సీఎం కేసిఆర్ రైతులకు వెన్నుదన్నుగా నిలిచి ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఖమ్మంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం మంత్రి చేశారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న రైతులు, వారి కుటుంబ సభ్యులు దేశవ్యాప్తంగా తిరగబడక ముందే కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలని అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి సీఎం కేసిఆర్ నాయకత్వంలో ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కు ఉద్యమాన్ని నిర్మించడం కొత్త, కష్టమూ కాదని ఈ ఉద్యమం బీజేపీ అహంకారపు కొమ్ములు విరిచే వరకూ సాగుతుందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రైతులకు అండగా ఉన్న సీఎం కేసీఆర్‌ మరోసారి అన్నదాతకు నేనున్నానంటూ అభయహస్తం అందించారని యాసంగి ధాన్యమంతా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని భరోసాను కల్పించారన్నారు. రూ. 1960 మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనడమే కాకుండా సాధ్యమైనంత త్వరగా నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేయనున్నామని ఇప్పటికే రైతుబంధు, నిరంతర ఉచిత విద్యుత్‌, సాగునీరు అందిస్తూ అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చి రైతు బాంధవుడిగా నిలిచారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

సాంఘిక ప్రయోజనం చూడాల్సిన కేంద్ర ప్ర భుత్వం వ్యాపార మనస్తత్వంతో కేవలం ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే చూస్తున్నదని మంత్రి విమర్శించారు. కేంద్ర నిర్ణయం రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారితే ప్రజలు, రైతులతో నిత్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలపై నిబద్ధతను సీఎం కేసీఆర్‌ ప్రదర్శించారని తెలిపారు. కేంద్రంతో ధాన్యం కొనిపిస్తామని వరి వేయండని రెచ్చగొట్టిన బీజేపీ నేతలు చేతులెత్తేసి పత్తా లేకుండాపోయారన్నారు. వారి ఓట్ల కుటిల రాజకీయ మాటలు అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ ఉండగా తెలంగాణకు ఏమీ కానివ్వరని, ఎన్నటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement