Wednesday, May 1, 2024

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారై వివాహ రిసెప్ష‌న్ – రూ.250కోట్లు ఖ‌ర్చు

త‌న కుమారై స్వ‌ప్నిరెడ్డి వివాహ రిసెప్ష‌న్ ని ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో అంగ‌రంగ‌వైభ‌వంగా చేయ‌నున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ వేడుక కోసం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సుమారు రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో 100 ఎకరాల్లో బాహుబలి రేంజ్‌లో భారీ సెట్టింగ్‌లు వేశారు. ఇందులో 30 ఎకరాల్లో రిసెప్షన్‌ వేదిక నిర్మించారు. ఈ రిసెప్షన్ కోసం సుమారు 10లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. 3లక్షల మంది అతిథుల అంచనాతో భోజన సదుపాయాలు సమకూర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

వర్షం వస్తే ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా టెంపరరీ వాటర్‌ప్రూప్‌ షెడ్లను నిర్మించారు. దాదాపు 60 వేల కార్లు పార్క్‌ చేసేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.స్వప్నిరెడ్డి వివాహం ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలిలో వైభవంగా జరిగింది. వధూవరుల కుటుంబసభ్యులతో పాటు అత్యంత సన్నిహితులతో కలిపి సుమారు 500 మంది ప్రత్యేక విమానాల్లో ఆ వేడుకకు తరలివెళ్లారు. రిసెప్షన్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర రంగాల ప్రముఖులు భారీగా హాజరుకానున్నారు. వీవీఐపీల కార్ల పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అతిథులకు ట్రాఫిక్ సమస్యల తలెత్తకుండా ఎస్‌ఆర్‌ గార్డెన్‌కు వెళ్లే మార్గంలో కాలువపై రూ.కోటి వ్యయంతో ఏకంగా బ్రిడ్జినే నిర్మించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement