Sunday, April 28, 2024

కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూప‌ల్లి…?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు, మాజీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అంశంపై దాదాపు ఖరారైంది. మే మొదటి వారంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేతృ త్వంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకు నేందుకు సిద్ధమయ్యారు. వచ్చే 4 లేదా 5న హైదరాబాద్‌లోని సరూ ర్‌నగర్‌ స్టేడియంలో నిరుద్యోగ నిరసన గర్జనను పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ గర్జన సభకు ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఈ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతు న్నారు. ఈ ఇద్దరు నాయకులతో పాటు వారి అనుచరులను పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానమే గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో.. రాష్ట్ర పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు హై కమాండ్‌కు నివేదికలు అందిస్తారు. తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఇతర పార్టీలోని అసంతృప్తులను, బలమైన నాయకులు చేర్చుకోవాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా వులను చేర్చుకుంటే.. ఖమ్మంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలలో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుతుందని సునీల్‌ కనుగోలు నివేదిక ఇచ్చారని తెలిసింది.

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా ప్రత్యేక చొరువ తీసుకుని పొంగులేటి, జూపల్లి కృష్ణారావులతో మంతనాలు కూడా సాగించారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరికను.. ఖమ్మం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆమె ఖమ్మం లోక్‌సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరితే.. ఖమ్మం పార్ల మెంట్‌ సీటు విషయంలో ఇబ్బం దులు వస్తాయని, అందుకు పొంగు లేటి చేరికను రేణుకాచౌదరి వ్యతిరేకిస్తు న్నారు. రేణుకాచౌదరిని బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, పలువురు సీనియర్‌ నాయకులు గురువారం ఆమె నివాసానికి వెళ్లారు. ఈ నెల 24న ఖమ్మంలో చేపట్టిన నిరుద్యోగ దీక్షతో పాటు పొంగులేటి చేరిక అంశాన్ని రేవంత్‌రెడ్డి చర్చించారు. 24న తాను అందుబాటులో ఉండటం లేదని, వీలైతే సభ తేదిని మార్చాలని లేదంటే పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేసి సభ విజయవంతమయ్యేలా చూస్తానని రేణుకాచౌదరి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే పొంగు లేటి చేరిక విషయంలో మాత్రం కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో చేరిక అంశం అధిష్టానం నిర్ణయం కావడంతో.. పొంగులేటి పార్టీలో చేరేలా చూడాలని రేణుకాచౌదరిని పీసీసీ చీఫ్‌ ఒప్పించినట్లు తెలిసింది. జూపల్లి కృష్ణారావు చేరిక విషయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన నాయకుల నుంచి పెద్దగా అభ్యంతరం వ్యక్తం కావడం లేదు. గతంలో కొల్లాపూర్‌ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా మంత్రిగా కూడా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో గెలిచి, మంత్రిగా కూడా పని చేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి చెందారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై అసంతృప్తితో ఉండగా పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తిరిగి సొంతగూటికి వచ్చేందుకు సిద్ధమైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఇద్దరు నాయకులను కూడా బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement