Friday, April 26, 2024

ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోసం భాష‌ల‌తో ఆట‌లాడుకుంటోన్న పార్టీలు.. మోడీ

2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం కావాలని బీజేపీ ప్రభుత్వం నొక్కి చెబుతోందని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ..బెంగ‌ళూరులో మెట్రో రైలు లైన్ తో పాటు ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించేందుకు మోడీ క‌ర్ణాట‌క‌కి చేరుకున్నారు. అందులో భాగంగా ముందుగా ఆయన చిక్కబళ్లాపూర్ లో శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మట్లాడుతూ.. రాజకీయ స్వార్థం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని పార్టీలు భాషలపై ఆటలాడుకుంటున్నాయని విమర్శించారు. . సబ్ కా ప్రయాస్ తో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా పయనిస్తోందని తెలిపారు. భారతదేశ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేశాం అని అన్నారు.

మోడీ ప్రారంభించిన శ్రీ మధుసూదన్ సాయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇది చిక్కబళ్లాపూర్ లోని ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ సంస్థ వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణను వాణిజ్యీకరించాలనే దృక్పథంతో స్థాపించారు. ఈ సంస్థ వైద్య విద్య, నాణ్యమైన వైద్య సంరక్షణను అందరికీ పూర్తిగా ఉచితంగా అందిస్తుంది. 2023 విద్యా సంవత్సరం నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ.. బెంగళూరు మెట్రో ఫేజ్ 2 కింద రీచ్ -1 విస్తరణ ప్రాజెక్టు వైట్ ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపుర మెట్రో లైన్ వరకు 13.71 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించారు. సుమారు రూ.4,250 కోట్ల వ్యయంతో మెట్రో మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం ప్రారంభం వల్ల బెంగళూరులోని ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుందని, నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న ఈ దక్షిణాది రాష్ట్రంలో ఈ ఏడాది ప్రధాని పర్యటించడం ఇది ఏడోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement