Tuesday, April 30, 2024

Asifabad: ఒకవైపు పట్టాలు, మరో వైపు కేసుల ఎత్తివేత.. పోడు రైతులకు కేసీఆర్ వరం

ఆసిఫాబాద్: పోడు రైతులపై గతంలో నమోదైన కేసులు ఎత్తివేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం కొమరంభీమ్ ఆసిఫాబాద్ నూతన కలెక్టరేట్ కార్యాలయంలో పోడు రైతులకు సీఎం కేసీఆర్ పోడు భూముల పట్టాలను అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తమ ప్రభుత్వ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని కేసీఆర్ చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీని కూడా నిర్మిస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లోని మారుమూల గ్రామాల రైతులకు వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ ను అందిస్తున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా కేసులు కొనసాగించడం సరైంది కాదన్నారు.

పోడు భూముల విషయమై గతంలో నమోదైన కేసులను ఎత్తివేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను ఆదేశించారు. మహిళల పేరుతోనే పోడు పట్టాల పంపిణీ జరుగుతుందని కేసీఆర్ చెప్పారు. పోడు పట్టాలను పంపిణీ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని లక్షన్నర మందికి 4.06 లక్షల ఎకరాల పోడు భూమిని పంపిణీ చేయనున్నట్టుగా కేసీఆర్ వివరించారు. పోడు రైతులకు రైతు బంధు కోసం రూ.24 కోట్లను కూడా మంజూరు చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement