Thursday, May 2, 2024

భార‌త్ పై.. బిల్ గేట్స్ ప్ర‌శంస‌లు

భార‌త్ పై మైక్రోసాప్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ ప్ర‌శంస‌లు కురిపించారు.భారత్ ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. ప్రపంచానికి ఆశాకిరణంగా నిలిచింది. భారీ సవాళ్లను ఏకకాలంలో ఎదుర్కోవచ్చని నిరూపించింది. భారత్‌ పోలియో వ్యాధిని పారద్రోలింది. హెచ్‌ఐవీ వ్యాప్తికి అడ్డుకట్టవేసింది. పేదరికం, శిశుమరణాలను తగ్గించింది. పారిశుద్ధ్యం, ఆర్థికసేవలను అధికశాతం మందికి అందుబాటులోకి తెచ్చింద‌ని భారత్‌ను బిల్‌గేట్స్ ప్రశంసించారు. పలు సమస్యలను ఏకకాలంలో ఎదుర్కోవచ్చని భారత్‌ రుజువు చేసిందన్నారు. గొప్ప భవిష్యత్తు ఉందన్న ఆశను భారత్ కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘గేట్స్ నోట్స్’ పేరిట తన బ్లాగ్‌లో తాజాగా రాసుకొచ్చారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భారీ సమస్యలను ఏకకాలంలో ఎదుర్కొవచ్చన్న నమ్మకం తనకుందని చెప్పారు. ఇందుకోసం సరైన ఆవిష్కరణలు, వాటి ఫలాలు ప్రజలకు అందేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే.. ప్రస్తుత సమస్యలను ఎదుర్కొనేందుకు కావాల్సిన డబ్బు, సమయం అందుబాటులో లేవని కొందరు తరచూ తనతో వ్యాఖ్యానిస్తుంటారని తెలిపారు. ఈ భావన తప్పని భారత్ రుజువు చేసిందన్నారు. ఇది తప్పని చెప్పేందుకు భారత్‌కు మించిన నిదర్శనం మరొకటి లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement