Thursday, May 2, 2024

హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం.. శ్మశానంలో సగం కాలిన యువకుడి మృతదేహం గుర్తింపు

హైదరాబాద్‌లో క్షుద్రపూజల కలకలం చెలరేగింది. కూకట్‌పల్లిలో సగం కాలిన యువకుడి శవం కనిపించడం స్థానికంగా ఆందోళన కలిగించింది. శ్మశానవాటికలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన కాటికాపరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగైదు రోజులుగా శ్మశానంలో ఎలాంటి అంత్యక్రియలు జరగలేదని, పండుగ రోజు శవం కనిపించడంతో క్షుద్ర పూజలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదర్‌గూడ్‌ తలాబ్‌ శ్మశానవాటికలో ఓ యువకుడి మృతదేహం 60 శాతం పైగా కాలి ఉండటం కనిపించింది. ఉదయం 10 గంటలకు కాటికాపరి కుటుంబం మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షుద్రపూజల కోసం చంపారా, బయటే చంపేసి శ్మశానికి తీసుకు వచ్చారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

నాలుగైదు రోజులు నలుగురైదుగురు రాత్రిపూట శ్మశానంలో సంచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే వారు మద్యం తాగేందుకు వచ్చి ఉంటారని భావించి స్థానికులు పెద్దగా పట్టించుకోలేదు. దీపావళి రోజు శవం కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అమావాస్య, మర్నాడు సూర్య గ్రహణం ఉండటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు హైదర్‌గూడలో జరిగినవి క్షుద్రపూజలు కాదని పోలీసులు చెబుతున్నారు. హైదర్‌గూడ శ్మశానంలో యువకుడి మృతదేహం ఎవరిదని తెలిస్తే మిస్టరీ వీడుతుందని చెబుతున్నారు. శ్మశానంలో 25-30ఏళ్ల  యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులతో కలిసి యువకుడు అక్కడికి వచ్చి ఉండటమో, ఇతర ప్రాంతాల్లో హతమార్చి ఇక్కడ కాల్చివేయడమో చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement