Friday, April 26, 2024

కార్డులున్నా నో జాబ్స్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఒకప్పుడు చేతినిండా పనితో తీరిక లేకుండా కనిపించిన పల్లెలు నేడు ఉపాధి కరువై వెలవెలబోతున్నాయి. దాదాపు ఒకటిన్నర దశాబ్దాలకు పైగా పేదల పొట్టనింపిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ ఏడాది పూర్తిగా నిర్వీర్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో, సమన్వయంతో అమలు చేయాల్సిన ఈ పథకానికి మోడీ సర్కారు నిధులు కేటాయించకపోవడంతో అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. ప్రతియేటా వేసవిలో 4 నెలల పాటు పేదలకు పని కల్పంచడమే లక్ష్యంగా నాడు యూపీయే ప్రభుత్వం చట్టం చేసి ప్రారంభించిన ఈ పథకాన్ని నేడు ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ దురుద్ధేశం తోనే నిర్వీర్యం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో లక్షలాది వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఇది గడ్డుకాలమేనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచ దేశాల మన్ననలు, ఐక్యరాజ్య సమితి ప్రశంసలు పొందిన ఉపాధి హామీ పథకం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి లక్ష్యం నిర్వీర్యమవు తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం హైదరాబాద్‌ జిల్లా మినహా మిగిలిన 32 జిల్లాల్లో అమలవుతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, మేజర్‌ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో మొత్తం 1,17,74,442 మందికి జాబ్‌ కార్డులున్నాయి. ఉపాధి హామీ పథకం పనులను పర్యవేక్షించడానికి మేటీ-లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, -టె-క్నికల్‌ అసిస్టెంట్లతో పాటు- సోషల్‌ ఆడిట్‌ అంటే సామాజిక పరిశీలన చేయా లనే ఉత్తర్వులున్నా నిధుల కటకటతో యంత్రాంగం పట్టించుకోవడం లేదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటు-తున్నప్పటికీ కూలీలకు మాత్రం ఆశించిన రేటు- పెంచడం లేదు. ప్రతి జాబ్‌కార్డు హోల్డర్‌కు సంవత్సరానికి కనీసం 200 రోజులు పని కల్పించాలనే చట్టపరమైన నిబంధన ఉన్నా గత ఏడాది పరిస్థితులను పరిశీలిసే 100 రోజులు కూడా పని కల్పించలేదు. కూలీ రేట్లు- నేటి ధరల ప్రకారం కనీసం రూ.600 పైన ఉండాలి. కూలీ రేట్లు- పెంచాలని, 100 రోజుల పని కల్పించాలని వామపక్షపార్టీలు, వ్యవసాయ కార్మికులు ఎంత పోరాటం చేసినా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నిమ్మకునీరెత్తినట్లు- వ్యవహరిస్తునాయి. సంవత్సరంలో కనీసం 300 రోజులు పని కల్పించినప్పుడే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసినా కేంద్రం ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో ఏమాత్రం ప్రాధాన్యత కల్పించలేదు.

పరిస్థితులు ఇలాగే ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, బీసీ, మైనార్టీ, సంచార జాతుల ప్రజలకు త్వరలో ప్రారంభమయ్యే వ్యవసాయ సీజన్‌లో, ముఖ్యంగా వేసవిలో కూలీ పనులు లభించక పస్తులుండవలసిన దుస్థితి తప్పదన్న ఆందోళన కనిపిస్తోంది. అందువల్ల కమ్యూనిస్టు పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాల పోరాట ఫలితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చింది. నాడు వామపక్షాలకు చెందిన 61మంది పార్లమెంట్‌ సభ్యులు యూపీఏకు మద్దతిచ్చినందున గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లు 2006లో ఆమోదం పొందింది. పార్లమెంట్‌లో కమ్యూనిస్టుల బలం తగ్గిన తరువాత ఆ చట్టం ఆచరణలో అనేక అవరోధాలను ఎదుర్కొంటు-న్నది. చట్టంలో పొందుపరిచిన నియమ నిబంధనల అమలులో అనేక లోపాలు చోటు- చేసుకుంటు-న్నాయి.

క్రమక్రమంగా ఉపాధి పథకం నిర్వీర్యం
ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏటా కోత పెడుతూ కూలీలకు పని దొరకకుండా చేస్తోంది. ఇప్పటికే ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉన్నా, కూలీలు శ్రమదోపిడీకి గురవుతున్నారన్న ఆవేదన గ్రామాల్లో వినిపిస్తోంది. కూలీలకు గ్యారెంటీ-గా పని కల్పించాలన్న చట్టం రాజకీయాల్లో నలిగిపోతోంది. కూలీ రేటు రూ.600కు, పని దినాలను 200 రోజులకు పెంచాలని దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు అసలుకే ఎసరు తెచ్చే ప్రయత్నాలపై సర్వత్రా ప్రజాగ్రహం కనిపిస్తోంది.

గత ఏడాది నుంచే తగ్గిన ప్రాధాన్యత
రెండు, మూడేళ్లకోసారి ఉపాధిహామీ కూలీల కనీస వేతనాన్ని ప్రభుత్వాలు పెంచుతూ వస్తున్నాయి. కూలీరేట్లను పరిశీలిస్తే 2020-21లో కనీస వేతనం రూ.237 ఉండగా కూలీలకు సరాసరి రూ.166 మాత్రమే అందింది. 2021-22లో రూ.161 మాత్రమే అందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వేతనాన్ని రూ.257కు పెంచగా కూలీలకు మాత్రం రూ.132 మాత్రమే అందుతోంది. దీంతో మండు-టె-ండల్లో పనిచేసినా కనీస వేతనం రావడం లేదని కొందరు కూలీలు ఇతర పనులకోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. కూలీలు చేసిన పనులను సిబ్బంది లెక్కించడంలో ఆలస్యం జరుగుతుండడం, కొలతల్లో తేడాల కారణంతో కూడా ఈ వ్యవహారం జరుగుతోంది. అలాగే గతంలో వేసవిలో పనిచేస్తే అదనంగా ఇచ్చే భత్యాన్ని సైతం కేంద్రం తొలగించడంతో కూలీలకు అంతంత మాత్రంగానే వేతనం అందుతోంది.

- Advertisement -

కరోనా కాలంలో సంజీవినిగా పనిచేసిన పథకం
నేడు నిర్లక్ష్యానికి గురవుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కరోనా కాలంలో దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు సంజీవనిలా పని చేసింది. నాటి కష్టకాలంలో వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే వారంతా కాలినడకతో సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఆ సమయంలో గ్రామాల్లో ఉపాధి కల్పించింది ఈ పథకమే. తాము ఈ పథకానికి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని నిధులు కేటాయించామని నాడు పార్లమెంటు-లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ గర్వంగా చెప్పుకున్నారు. కానీ నేడు 2023-24 వార్షిక బడ్జెట్‌లో కేవలం రూ.60 వేల కోట్లు మాత్రమే కేటాయించి ఉసూరుమనిపించారు.

ఉపాధి కూలీలకు కేంద్రం ముెెండిచేయి
అలాంటిది ఈసారి 2023-24 కేంద్ర బడ్జెట్లో కేవలం రూ.60 వేల కోట్లే కేటాయించారు. గత బడ్జెట్‌ కంటే రూ.30 వేల కోట్లు- తక్కువ. 2022-23లో ఈ పథకానికి బడ్జెట్లో రూ.73 వేల కోట్లే కేటాయించగా, పెరుగుతున్న అసమానతలు, ద్రవ్యోల్బణం కారణంగా అనివార్యంగా రూ.89,400 కోట్లకు పెంచుతూ కేటాయింపులను సవరించారు. సవరించిన సుమారు రూ.90 వేల కోట్ల కంటే రూ.30 వేల కోట్లు- ఈసారి తక్కువగా బడ్జెట్లో కేటాయించబడ్డాయి. పీపుల్స్‌ యాక్షన్‌ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ అనే సంస్థ అంచనా ప్రకారం పెరిగిన ధరలు, పెంచాల్సిన ఉపాధి దినసరి రేటు- ఆధారంగా 2023-24 బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కనీసం రూ.2.72 లక్షల కోట్లు- కేటాయించాల్సి ఉంది. కానీ ఈ వాస్తవాన్ని కేంద్రం విస్మరించింది. కేంద్ర బడ్జెట్‌లో ద్రవ్యలోటు-ను తగ్గించి చూపేందుకే సామాన్యులకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకానికి నిధులు మూడోవంతు తగ్గించారు.

రాజకీయ దురుద్దేశంపై సర్వత్రా విమర్శలు
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేవలం శతకోటీ-శ్వరుల సంపద పెంచేందుకు అవసరమైన విధివిధానాలు, చట్టాలను రూపొందించడంలోనే నిమగ్నమైందని సర్వత్రా ఆరోపణలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. జాతి సంపదను పళ్ళెంలో పెట్టి ఇచ్చేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీ-కరిస్తున్నదని సీఎం కేసీఆర్‌ అనేక సందర్భాల్లో ఆరోపించారు. దీంతో అసమానతలు విపరీతంగా పెరిగి శతకోటీ-శ్వరుల చేతిలో 40 శాతం దేశ సంపద పేరుకుపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 50 శాతం ప్రజల చేతుల్లో ఉండాల్సిన సంపద 3శాతం మాత్రమే ఉన్నట్లు- స్పష్టమైన లెక్కలున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత మునుపెన్నడూ లేని రీతిలో పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ప్రజలకు ఊతమిచ్చే చర్యలు తీసుకోవడంతో పాటు- పట్టణ ఉపాధి పథకం కూడా తీసుకురావలసిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తక్కువ చేస్తూ, క్రమంగా ఉపాధి పథకాన్ని ఎత్తివేసే కుట్రలు చేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement