దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ యూజీ ఫలితాలు ఇవ్వాల (మంగళవారం) సాయంత్రం కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులో మెరిసి సత్తా చాటాడు. ఏపీకి చెందిన బోర వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ 99.99 పర్సంటైల్ సాధించి తొలి ర్యాంకు సాధించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. ఈ ఫలితాలకు సంబంధించి అఫీషియల్ వెబ్ సైట్https://neet.nta.nic.in/లో చెక్ చేసుకోవచ్చని ఏజెన్సీ తెలిపింది.
ఇక.. నీట్కు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఈ ఏడాది నీట్కు దేశవ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836 మంది, తెలంగాణ నుంచి 42,654మంది అభ్యర్థులున్నారు. తెలంగాణకు చెందిన కెజి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్ ప్రవధాన్ రెడ్డి తొలి ర్యాంకు రాగా, ఎస్సీ కేటగిరీలో ఏపీ విద్యార్థి కె.యశశ్రీకి రెండో ర్యాంకు సాధించాడు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4వ తేదీన ప్రిలిమినరీ ఆన్షర్ కీని విడుదల చేసిన ఎన్టీఏ.. దీనిపై జూన్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ అధికారులు తాజాగా తుది ఆన్సర్ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.