Tuesday, April 30, 2024

వందల సంఖ్యలో రాబందులు మృతి.. ఇది దుండగుల పనే అంటున్న ఫారెస్ట్​ ఆఫీసర్లు

అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న రాబందులు పెద్ద ఎత్తున చనిపోయాయి. ఈ ఘటన అస్సాంలోని కమ్రూప్ జిల్లా ఛయ్‌గావ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దాదాపు 100 రాబందులు ఒకేసారి చనిపోయి ఉండడం. మరికొన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. అస్సాంలోని ఛాయ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలాన్‌పూర్ ప్రాంతంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నిన్న సాయంత్రం సుమారు 100 రాబందుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే చనిపోయిన రాబందులు మేక కళేబరాన్ని తిన్నాయని, విషపూరితమైన ఆహారం తినడం వల్లే అవి చనిపోయాయని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

కమ్రూప్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్‌కు చెందిన జిల్లా అటవీ అధికారి (డిఎఫ్‌ఓ) డింపి బోరా మాట్లాడుతూ.. ‘‘ఒకేసారి దాదాపు 100 రాబందులు చనిపోవడాన్ని తాను మొదటిసారి చూశానని చెప్పారు. రాబందులు కళేబరాల దగ్గర మేక ఎముకలు దొరికాయి.. విషపూరిత మేక కళేబరం తిని రాబందులు చనిపోయాయని అనుమానిస్తున్నాం.. అయితే మరణానికి గల కారణాలు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలుతుంది.. ఇది పెద్ద నేరం. మేక కళేబరంలో విషం కలిపిన వ్యక్తిని అరెస్ట్ చేస్తాం’’ అని బోరా తెలిపారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మరోసారి పెద్ద సంఖ్యలో రాబందులు చనిపోయాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్థానికులకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తామని అధికారులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement