Thursday, May 2, 2024

దేశ రాజధానికి చేరిన గ్రీన్ ఛాలెంజ్.. లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వినూత్న రూపం తీసుకుంది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కరోల్‌బాగ్ జోన్ నరైనా ఇండస్ట్రియల్ ఏరియా పార్క్‌లో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మొక్కలు నాటారు. పార్క్ ఖాళీ స్థలంలో మియావాకీ పద్దతిలో వెయ్యి మొక్కలు నాటి మినీ ఫారెస్ట్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అభివృద్ధి చేస్తోంది. నాలుగేళ్ల క్రితం తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి ఫలితాలు సాధిస్తోందని ఎంపీ సంతోష్ తెలిపారు. పచ్చదనం పెంపు దిశగా అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తున్నామని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నలుదిశలా హరిత స్ఫూర్తి విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకుని దశలవారీగా పూర్తిచేస్తామని సంతోష్ తెలిపారు.

యువ ఎంపీ సంతోష్ ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని తీసుకున్నాడని, ఇందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా హరిత భారత్ కార్యక్రమాన్ని తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ జైరామ్ రమేష్ ఆకాంక్షించారు. ఢిల్లీ లాంటి ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అత్యంత అవసరమని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. పర్యావరణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా పచ్చదనం పెంపు తక్షణావసరమని, ఆ దిశగా కృషి చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి అభినందనలు అని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో తనవంతుగా భాగస్వామ్యం తీసుకునేందుకు రాంకీ సంస్థ ముందుకొచ్చింది. ఢిల్లీలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా తమ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా ఒక పార్కును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌కీ సంస్ధ చైర్మన్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు, ఎంపీలు జైరాం రమేష్ (కాంగ్రెస్), సంజయ్ సింగ్ (ఆప్), బినోయ్ విశ్వం (సీపీఐ,) అనిల్ దేశాయ్ (శివసేన)తో పాటు వైఎస్సార్సీపీ ఎంపీలు విజయ సాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వంగా గీత, మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు,

జి.రంజిత్ రెడ్డి, మన్నే శ్రీనివాసరెడ్డి, మాలోత్ కవిత, వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, కెఆర్, సురేష్ రెడ్డి, పసునూరు దయాకర్, పీ. రాములు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థల డైరెక్టర్ ఎన్. బలరామ్ కూడా పాల్గొని మొక్కలు నాటారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement