Thursday, May 2, 2024

బాంబే హైకోర్టులో – న‌వాబ్ మాలిక్ కి మ‌రోసారి చుక్కెదురు

మహారాష్ట్ర మంత్రి..ఎన్ సీపీ నాయ‌కుడు న‌వాబ్ మాలిక్ కు బాంబే హైకోర్టులో చుక్కెదుర‌యింది. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఆయ‌న దాఖ‌లు చేసిన హెబియ‌స్ కార్ప‌స్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయ‌న మ‌రి కొంత కాలం పాటు క‌ష్ట‌డీలోనే ఉండ‌నున్నారు. పరారిలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం , అతని సహాయకుల కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ ను ఫిబ్రవరి 23న ED అరెస్టు చేసింది. అయితే ఆయ‌న‌ను తొలుత ఈడీ కస్టడీకి పంపి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మంత్రి అరెస్టు, ఆ తర్వాత జ్యుడీషియల్‌ కస్టడీ చట్టవిరుద్ధమని మాలిక్‌ తరపు న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ గత విచారణలో హైకోర్టుకు తెలిపారు. అరెస్ట్‌ను రద్దు చేసి, పక్కన పెట్టాలని, తాత్కాలిక ఉపశమనంగా వెంటనే కస్టడీ నుంచి విడుదల చేయాలని సీనియర్ న్యాయవాది డిమాండ్ చేశారు.

అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్, ఈడీ తరపున వాదించిన న్యాయవాది హితేన్ వెనెగోకర్ మాట్లాడుతూ.. మాలిక్‌ను సరైన ప్రక్రియ ప్రకారం అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. ప్రత్యేక పీఎమ్‌ఎల్ఏ కోర్టు జారీ చేసిన ఆయ‌న రిమాండ్ ఆర్డర్ అతనిని ఈడీ కస్టడీకి తరలించడానికి సరైన కారణాలను చూపింద‌ని కోర్టుకు చెప్పారు. కాగా.. మంత్రి నవాబ్ మాలిక్ దాఖ‌లు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ (అక్ర‌మంగా అరెస్టు చేసిన వ్య‌క్తిని న్యాయస్థానం లేదా న్యాయమూర్తి ఎదుట‌కు తీసుకురావ‌డానికి జారీ చేసే రిట్ ) స‌రైంద‌ని కాద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కేసులో మంత్రి రెగ్యులర్ బెయిల్ కోరాలని కూడా ఆయ‌న సూచించారు.
అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని సోదరుడు అనీస్, ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్ మరియు ఇతరులపై నమోదైన కేసులో ఈడీ నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేసి విచారిస్తోంది. గత నెలలో ఈ కేసుకు సంబంధించి దావూద్ ఇబ్రహీం సోదరి దివంగత హసీనా పార్కర్ నివాసంతో సహా నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు దాడులు జరిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement