ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కీలక ప్రకటన చేశారు. దేశ రాజధానిలో పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనాలను బయటకు తీసుకురావొద్దన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంక్లలో పెట్రోల్ లభించదని స్పష్టం చేశారు. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ లేకుంటే.. ఢిల్లీలోని ఫ్యుయెల్ స్టేషన్లు ఆ వాహనాలకు పెట్రోల్ లేదా డీజిల్ పోయరని తెలిపారు. నగరంలో రవాణా శాఖ తనిఖీలను పెంచనుంది. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా ప్రయాణించే వారు రూ. 10 వేల భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
కాబట్టి, ఢిల్లీ ప్రయాణికులు పొల్యూషన్ కంట్రోల్ను దగ్గర బెట్టుకుని రోడ్డు ఎక్కాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.శీతాకాలం సమీపిస్తున్నదంటే ఢిల్లీ వాసులు గజగజ వణికిపోతారు. చలికి కాదు.. కాలుష్యాన్ని వాయువులను పీల్చి ఎక్కడ ప్రాణాల మీదికి తెచ్చుకుంటామో అని. కొన్నాళ్లుగా చలి కాలం వచ్చిందంటే… ఢిల్లీ మొత్తాన్ని కాలుష్య దుప్పటి కప్పేస్తుంది. కొన్నిసార్లు అయితే సూర్యుడు కూడా కనిపించకుండా అంతా మబ్బుగా కాలుష్యం పేరి ఉండటాన్ని చూశాం. కాలుష్య తీవ్రత ప్రమాదకరంగా పెరిగిందని ఎన్నోసార్లు హెచ్చరికలు వెలువడటాన్ని చూశాం. ఇందుకోసం కేజ్రీవాల్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకున్నా.. అవి స్వల్ప పరిధి మేరకే ఫలితాలు ఇచ్చాయి. సరి, బేసి నంబర్ల వాహనాలకు వేర్వేరు రోజుల్లో అనుమతి ఇవ్వడం మొదలు పలు చర్యలు తీసుకున్నారు. కానీ, ఫలితాలు ఆశించిన మేరకు లభించలేవు. చలి కాలం సమీపిస్తుండటంతో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వాయు కాలుష్యంపై దృష్టిని సారించారు.