Sunday, May 5, 2024

Big Story: మేడారం జాతర.. అంత స్పెషాలిటీ ఏమిటంటే..

గిరిజన మహిళలు అయిన సమ్మక్క, సారలమ్మలు అప్పట్లో కాకతీయులతో జరిగిన పోరాటంలో అమరులవుతారు. ఆ తర్వాత చిలకలగుట్ట దగ్గర ఓ కుంకుమ భరణి రూపంలో సమ్మక్క గిరిజనులకు కనిపించి.. తనను నిండు మనుసుతో కొలిచి, మొక్కుకుంటే కోరికలు నెరవేరుస్తానని చెబుతుంది. అప్పటి నుంచి గిరిజనుల పండుగగా ఉన్న మేడారం.. పిల్లలు లేని వారికి వరంలా మారుతుంది. దీంతో చాలామంది ఆ మహిమగల తల్లుల చెంత వరంపట్టి, కోరిక నెరవేరడంతో తమ మొక్కు చెల్లించుకుంటారు. ఇక్కడ సాధారణంగా పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) మాత్రమే మొక్కులుగా చెల్లిస్తారు. ఎలాంటి గుడి, విగ్రహం లేని మహోన్నతమైన దైవంగా సమ్మక్క, సారలమ్మ వెలుగొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ ఏది అంటే ముందుగా వినిపించే పేరు మేడారం జాతర. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. దేశంలో కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పూర్వపు వరంగల్ జిల్లా.. ప్రస్తుతం మలుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. తొలినాళ్లలో ఈ జాతరను ప్రధానంగా గిరిజనులు జరుపుకునేవారు.. రాను రాను అమ్మవార్ల మహిమలు తెలిసి అందరూ కొలిచి, మొక్కుతున్నారు.

13వ శతాబ్దంలో సమ్మక్క, సారలక్క అనే తల్లీ బిడ్డలు ప్రజల కోసం అప్పటి కాకతీయులతో పోరాడి అమరులయ్యారు. అయితే వారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా భక్తులు నమ్ముతారు. అందుకే సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని పెద్ద పండుగలా జాతరను జరుపుకుంటారు. మేడారం చరిత్ర విషయానికి వస్తే.. 1000 క్రీ.శతాబ్దంలో మేడారం ప్రాంతంలో ఉన్న గిరిజనులు అడవిలో వేటకు వెళ్తారు. అక్కడ పులులతో ఆడుకునే ఒక చిన్న పాప వారికంట కనబడుతుంది. సాక్షాత్తు దైవాంశ సంభూతురాలిగా ఆ పాప తేజాన్ని ప్రకాశిస్తూ ఉండేది. గిరిజనులు ఆ పాపను అడవి నుంచి తీసుకురావడంతో వారి గిరిజనుల రాజు ఆమెకు సమ్మక్క అని నామకరణం చేసి సొంత బిడ్డలా పెంచుకుంటారు. వయసు వచ్చిన తర్వాత పగిడిద్ద రాజు అనే అక్కడి గిరిజన రాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. ఆ కాలంలో ఆంధ్రా వరంగల్ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించే వారు. ఈ పడిగిద్ద రాజు కూడా కాకతీయుల కిందే పనిచేసేవాడు.

కాకతీయులతో యుద్ధం ఎందుకు చేస్తారు..
గిరిజనుల లీడర్​ అయిన పగిడిద్ద రాజును కాకతీయులు ఎక్కువ కప్పం కట్టాలని డిమాండ్ చేస్తారు. పగిడిద్ద దాన్ని వ్యతిరేకించడంతో పాటు పంటలు పండలేదని, కప్పం కట్టబోమని తెగేసి చెబుతాడు. కాకతీయుల వద్ద పనిచేస్తున్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడతాడు. అది సహించని కాకతీయులు వారితో యుద్ధానికి దిగుతారు. ఈ యుద్ధంలో గిరిజన లీడర్లు అంతా చనిపోతారు. అయితే.. పగిడిద్ద రాజు, సమ్మక్కకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వారి పేర్లు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. వీరందరూ కూడా కాకతీయులతో జరిగిన పోరాటంలో హతమవుతారు. కాగా, జంపన్నను అక్కడున్న వాగులో పడేయడంతో అప్పటి నుంచి మేడారం సమీపంలో ఉన్న వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. సమ్మక్క, సారలమ్మలకు వారి నడుం నుంచి కత్తులు దిగబడ్డా కూడా అలానే నడుచుకుంటే ఓ గుట్టలో అదృశ్యమవుతారు. అప్పటి నుంచి వారిని దేవతలుగా కొలిచి ఆరాధిస్తున్నారు భక్తులు. అయితే.. 1998లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి ప్రతి రెండు ఏళ్లకు వచ్చే ఈ జాతరకు ప్రభుత్వం దగ్గరుండి అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement