Thursday, May 2, 2024

Exclusive | రైతులకు మేలు చేసేలా చర్యలు.. ఫుడ్​ ప్రాసెసింగ్, మోడ్రన్​ రైస్​ మిల్లులు కావాలి: సీఎం కేసీఆర్​

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తూ  రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని సీఎం కేసీఆర్​ అన్నారు. ఇవ్వాల (శుక్రవారం) రాత్రి జరిగిన రివ్యూలో పలు అంశాలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు సహా మరి కొద్దిరోజుల్లో పూర్తికానున్నాయని తెలిపారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల  ప్రాజెక్టులతో రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి మరో కోటి టన్నులకు  పెరిగి మొత్తంగా 4 కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలున్నాయని సీఎం అన్నారు. ఇటువంటి పరిస్థితులల్లో రాష్ట్ర వ్యవసాయ విధానంలో భాగంగా ఫుడ్ ప్రాసెస్ కంపెనీలను స్థాపించాలని నిర్ణయించామని చెప్పారు. ఇందులో భాగంగా మిల్లింగ్ కెపాసిటీని పెంచే దిశగా రాష్ట్రంలో కొనసాగుతున్న మిల్లులకు అధనంగా మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.  

అదే సందర్భంలో… రాష్ట్రంలో నిల్వ వున్న 1 కోటి 10 లక్షల టన్నుల వరిధాన్యం,  4 లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకోకుండా ఎఫ్ సీ ఐ పలు రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నదని, ఈ పంట ఇట్లా వుంటే అధనంగా మరింత వరి ధాన్యం దిగబడి కానున్న పరిస్థితుల్లో..  రైతు పండించిన వరి పంటను పలు రకాల ఆహార ఉత్పత్తులుగా మలిచి, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు  ఎగుమతి చేసి, రైతుకు మరింత లాభం చేకూరేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రైతు సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకుని, వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సిఎం కేసీఆర్​ తెలిపారు. అందులో భాగంగానే ప్రస్థుతమున్న రైస్ మిల్లులు యధా విధిగా కొనసాగుతూనే, అధునాతన మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించే దిశగా కార్యాచరణ  చేపడుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు.

 రాష్ట్రంలో ప్రస్థుతం వున్న రైస్ మిల్లుల సామర్థ్యం కోటి టన్నుల వరకు మాత్రమే ఉన్నదన్నారు. మరో రెండు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నేపథ్యంలో అధనంగా పండుతున్న ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్టుగా అధునాత రైస్ మిల్లులను ఏర్పాటు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారు కోసం  కమిటీని సిఎం ప్రకటించారు.  ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షులుగా,  సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటి ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్,సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, టిఎస్ ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా కొనసాగుతారు. ఇందుకు సంబంధించి., శుక్రవారం డా.బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సిఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశంలో… మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి దామోదర్ రావు, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,  సిఎం ఓ అధికారులు, నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ఆర్థిక శాక ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి రామకృష్ణారావు,  సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటి ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఎం ఏ యూ డీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, టిఎస్ ఐఐసి ఎండీ నర్సింహారెడ్డి , వారితో పాటు, అంతర్జాతీయ రైస్ మిల్లు తయారీ కంపెనీ సటాకే’ ఇండియా డైరక్టర్ ఆర్. కె.బజాజ్ తదితర ప్రతినిధులు సమీక్షా సమావేశంలో  పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement