Tuesday, April 30, 2024

మావోయిస్టుల బంద్.. ఏజెన్సీలో టెన్షన్

ఆపరేషన్ ప్రహార్‌ ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్‌ ను జయప్రదం చేయాలని కోరుతూ ఛత్తీస్‌ గఢ్ సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టులు రకరకాల అలజడి సృష్టిస్తున్నారు. నారాయణపూర్ జిల్లాలో అటవీశాఖ పనులు చేస్తున్న జెసీబీని నక్సల్స్ ఆదివారం తగులబెట్టారు. ఛత్తీస్‌గఢ్ అటవీప్రాంతాలపై నక్సల్స్ ప్రభావం సరిహద్దు తెలంగాణ ఏజెన్సీపై పడకుండా ఇక్కడి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఆదివారం చర్లలో జరుగుతున్న సంతకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలపై పోలీసులు డేగకన్ను వేసి ఉంచారు. అనుమానిత ఆదివాసీలను తనిఖీలు చేసి ఆరా తీశారు.

‘మావోయిస్టుల బంద్‌లు.. ఆదివాసీల ఇబ్బందులు’ అంటూ చర్ల, దుమ్మగూడెం మండలాల్లో పలుచోట్ల ఆదివాసీ సంఘాల పేరుతో కరపత్రాలు వెలిశాయి. ఆ కరపత్రాల్లో మావోయిస్టుల వైఖరిని ఎండగట్టారు. మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, బలవంతంగా ఆదివాసి యువతులను ఉద్యమంలోకి లాగి వారి జీవితాలను దుర్బరం చేస్తున్నారని కరపత్రాల్లో పేర్కొన్నారు. బంద్‌కి ఒకరోజు ముందు బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో వెలసిన కరపత్రాలు చర్చనీయాంశంగా మారాయి. మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపు నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లా సరిహద్దుల్లో భారీగా భద్రత దళాలను మోహరించారు. అర్ధరాత్రి నుండి ఏజెన్సీ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు.

కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆపరేషన్ ప్రహార్ కు వ్యతిరేకంగా నేడు(ఏప్రిల్ 26) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గత వారం రోజుల క్రితం బంద్ ప్రకటన చేసిన మావోలు , దాన్ని విజయవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తమకు పట్టున్న రాష్ట్రాలు , ప్రాంతాల్లో ప్రజలు సహకరించాలని విజ్ఝప్తి చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వాల చర్యలకు నిరసన వ్యక్తం చేయడంతో బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ..అనేక చోట్ల విధ్యంసం సృష్టించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement