Thursday, April 25, 2024

కూతుర్ని ప్రేమించాడని.. యువకుడిని నరికేసిన తండ్రి

కూతురిని ప్రేమించిన ఓ యువకుడిపై ఆ యువతి కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. నమ్మకంగా గ్రామానికి రమ్మని చెప్పి.. అతడి కాళ్లు, చేతులను నరికి వేశారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడుకి అదే గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం అయ్యింది. ఇంటర్మీడియెట్ చదువుతున్న ఆ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం ఆ యువతి ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిసింది. వెంకటేశ్ ను పిలిపించి గ్రామంలో పంచాయతీ పెట్టారు. అప్పటి నుంచి వెంకటేశ్ గ్రామానికి దూరంగా ఉంటున్నాడు. అయినప్పటికి వెంకటేష్ మాత్రం అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.

ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. పక్కా ప్లాన్ ప్రకారం యువకుడిని గత రాత్రి నమ్మకంగా గ్రామానికి పిలిపించారు. మాట్లాడాలంటూ శివారులో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.. ఆమె తండ్రి మరో ఐదుగురు కలిసి యువకుడ్ని మారణాయుధాలతో దాడి చేసి కాళ్లు, చేతులు నరికేశారు. పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. దాడికి పాల్పడ్డ ఆరుగురు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement