Monday, April 29, 2024

పంజాబ్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు – కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవ‌లు నిలిపివేత‌

శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందార‌ని, హింసను నియంత్రించడంలో విఫలమయ్యార‌ని ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులపై సీఎం భగవంత్‌ మాన్‌ సర్కార్ చ‌ర్య‌లు తీసుకుంది. పటియాలా రేంజ్ ఐజీతో పాటు ఎస్‌ఎస్‌పీ, ఎస్‌పీలను ఆ పదవి నుండి బదిలీ చేశారు. కాగా, పోలీసులు ప‌టియాలాలో నిన్న‌ రాత్రి 7 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ప‌రిస్థితులు ఇప్ప‌టికీ అలాగే ఉండ‌డంతో ఈ రోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు పంజాబ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.పంజాబ్ లోని పటియాలాలో నిన్న‌ కాళీ మందిర్‌ ప్రాంతంలో శివసేన నేతలు, ఖలిస్థాన్ మ‌ద్ద‌తుదారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకోవ‌డం తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది. ఖలిస్థాన్ మ‌ద్ద‌తు దారులు, శివ‌సేన కార్య‌క‌ర్త‌లు నిన్న పోటీగా ర్యాలీలు చేపట్టడంతో ఈ ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు క‌త్తుల‌తో వీరంగం సృష్టించ‌డం, రాళ్ల దాడి చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపాయి. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో పటియాలాకు అదనపు బలగాలను ర‌ప్పించారు. ఉద్రిక్త ప‌రిస్థితులు చ‌ల్లార‌క‌పోవ‌డం, వదంతులు వ్యాపిస్తుండ‌డంతో సీఎం భగవంత్‌ మాన్ కీల‌క‌ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement