నవీపేట (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చిరుతపులి భయం నెలకొంది. నవీపేట మండలం మోకన్ పల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చిరుత సంచారం కలకలం రేపింది. రెడ్డి ఫారం గుట్ట పక్కన గల ఇటుక బట్టీలో చిరుత తన పిల్లలతో కలిసి ఒక కుక్కపై అటాక్ చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న కూలీలు ఇది చూసి భయాంతో పరుగులు తీశారు.
అనంతరం రోడ్డుపై కొద్దిసేపు సంచరించిన చిరుత.. కమలాపూర్ శివారులోని గుట్టలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, చిరుత పిల్లలు మోకన్ పల్లి కస్తూర్బా పాఠశాల వెనుక భాగం గుట్టలోకి వెళ్లాయని కూలీలు తెలిపారు. చిరుత సంచరిస్తున్న సమాచారం అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు అందించారు.