Saturday, May 4, 2024

మహిళబందు కేసీఆర్ పేరిట సంబరాలు.. టీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అద్భుతమైన సంక్షేమ, సంరక్షణ, కార్యక్రమాల నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6,7,8 తేదీలో మహిళబందు కెసీఆర్ పేరిట సంబరాలు నిర్వహించాలని తెలిపారు. మార్చి 6వ తేదీన కెసిఆర్ కి రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం చేయనున్నారు.- కెసిఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయనున్నారు.  

అలాగే, ఈ నెల 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం, లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేయనున్నారు. ఈ నెల 8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబరాలు నిర్వహించనున్నారు. గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతో పాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. 10 లక్షల మంది పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలోని తొలి ప్రభుత్వం టిఆర్ఎస్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సుమారు 11 లక్షల మంది కెసిఆర్ కిట్ లబ్ధిదారుల మైలురాయిని చేరుకుందన్నారు.

ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. నాలుగు దశాబ్దాలకు పైగా తన రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న గొప్ప పాలకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. క్షేత్రస్థాయి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారు. అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టింది. ఆడబిడ్డల నీటి కష్టాలను దూరం చేయాలన్న ప్రాథమిక లక్ష్యంతో దేశం ఎరుగని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కెసిఆర్ గారు విజయవంతంగా పూర్తి చేశారు. మాతా శిశు సంరక్షణ కోసం కెసిఆర్ కిట్టు పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రసవానికి ముందు,ప్రసవం సమయంలో, ప్రసవం తర్వాత అవసరమైన అన్ని రక్షణ కార్యక్రమాలను ఇందులో చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం ఇంత నిబద్ధతతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన దేశంలోని ఏకైక ప్రభుత్వం మనదన్నారు.

కేసీఆర్ కిట్టు ద్వారా ఇప్పటి దాకా సుమారు 11 లక్షల మందికి 1700 కోట్ల లబ్ధి… ఒక్కొక్కరికి 13 వేల లబ్ధి చేకూరుతుంది. కేసీఆర్ కిట్ ద్వారా మాతా శిశు మరణాలు తగ్గాయి… ప్రభుత్వాసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయి. కల్యాణలక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది లబ్ధిదారులకు 9022 కోట్ల రూపాయలను ప్రభుత్వం పెళ్లి కానుక అందజేసినది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నది. వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నది. మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యాశాఖ లోనూ అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారు. 70 లక్షల హెల్త్ మరియు hygienic కిట్లను విద్యార్థులకు అందించామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇతరులు బేటీ బచావో బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం మనదే అని పేర్కొన్నారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ అనేక కార్యక్రమాలను చేపట్టామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement