Saturday, May 18, 2024

30వేల విద్యా సంస్థలకు ఇంటర్నెట్‌.. ఈ ఏడాది నుంచే ఇంగ్లిష్​ బోధన: కేబినెట్​ సబ్​కమిటీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: త్వరలోనే టీ ఫైబర్‌ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 30వేల విద్యా సంస్థలన్నింటికీ బ్యాండ్‌విడ్త్‌ (ఇంటర్నెట్‌) సౌకర్యాన్ని కల్పించబోతున్నామని, తద్వారా భవిష్యత్‌లో డిజిటల్‌ విద్యను ప్రభుత్వ విద్యార్థులకు అందించడం సులభతరం అవతుందని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. పాఠశాల స్థాయిలో కొత్తతరం పిల్లల్లో ఔత్సాహికవేత్తలను ప్రోత్సహించేందుకు వీలుగా కొత్త సిలబస్‌ను రూపొందించాలని అభిప్రాయపడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడిలో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని నిర్ణయించింది. లక్ష్యాలకు అనుగుణంగా పనులను చేపట్టి జూన్‌ 13 కల్లా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. మన ఊరు-మన బడి పథకం అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం శనివారం భేటీ అయింది.

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రశాంత్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న విద్యా సంస్థలకు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థలకు ఒకే కరిక్యులమ్‌, ఒకే విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. ప్రతి వారం వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహించి మన ఊరు-మన బడి పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. మే నెలలో ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా విద్యా సంస్థల్లో మొక్కలు నాటేందుకు, పచ్చదనాన్ని పెంచేందుకు రెండు, మూడు రోెజులు కేటాయించాలని తెలిపింది. ఆకర్షణీయమైన పాఠశాలల భవనం, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చూడటంతో పాటు విద్యార్థులకు పాఠశాలల వైపు ఆకర్షితులను చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించింది.

జూన్‌ 1 నుంచి బడిబాట…
జూన్‌ 1 నుంచి 12 వరకు బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ నిర్వహించనుంది. గత రెంళ్లుగా కరోనా వ్యాప్తి కారణంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించలేని పరిస్థితి. జూన్‌ 13 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి ముందే జూన్‌ 1 నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న వివరాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించేలా బడిబాట కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ ఏడాది (జూన్‌ 13 నుంచి) నుంచే 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తరగతులు ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇద్రారెడ్డి తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. జూన్‌ 12 కల్లా మన ఊరు-మన బడి అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. మొదటి విడతలో 50 శాతం పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల్లో మౌలిక వసతుల కల్పన, డిజిటల్‌ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు అధికారులంతా కృషి చేయాలని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో పనులను త్వరతగతిన పూర్తి చేసి జూన్‌ 13 కల్లా పాఠశాలలు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పనులను పర్యవేక్షించాలని మంత్రి పేర్కొన్నారు.

రూ.3,500 కోట్లు విడుదల…
మన ఊరు-మన బడి పథకంలో భాగంగా మొదటి విడతలో 9వేల పాఠశాలలను ఎంపిక చేశారని మంత్రి తెలిపారు. దాదాపు రూ.3,500 కోట్ల నిధులను మొదటి విడతలో పాఠశాలలకు మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. మిగతా స్కూళ్లకు కూడా నిధుల మంజూరు చేస్తామని తెలిపారు. ఇంగ్లీష్‌ మీడియం బోధన కోసం టీచర్లకు ట్రైనింగ్‌ ఇస్తున్నామన్నారు.

పాఠశాలలకు క్రీడా సామాగ్రి: మంత్రి కేటీఆర్‌
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తన నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా పరికరాలను కొనుగోలు చేసేందుకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఒక్కో పాఠశాలకు రూ.50వేల చొప్పున నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ విధంగా ముందుకు వస్తే క్రీడలకు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు.

- Advertisement -

జూనియర్‌ కాలేజీల అభివృద్ధి…
మన ఊరు మన బడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్న ఆవరణలోనే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. అయితే వీటిని కూడా అభివృద్ధి చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ పథకంలో చేపట్టిన పనులను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పాఠశాల విద్యా డైరెక్టర్‌ దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement