ములుగు ప్రభ న్యూస్: కరోనా వ్యాధి లాక్ డౌన్ మూలంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షా ఫలితాలో తీవ్ర నష్టం జరిగిందనీ, ఆన్లైన్ చదువుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు సరైన మొబైల్, ల్యాప్ టాప్స్ లేక, కనీసం ఇంటర్ నెట్ సదుపాయాలు లేని కారణంగా ఆన్లైన్ తరగతులు వినలేని పరిస్థితుల్లో విద్యార్థులకు చాలా నష్టం జరిగిందని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు భద్రయ్య అన్నారు. కరోనా వ్యాధి నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఇంటర్ విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చివేస్తామని చెప్పిన విషయాన్ని విస్మరించి ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు నిర్వహించడం వల్ల ఎంతో మంది విద్యార్థులు అన్యాయానికి గురయ్యారని భద్రయ్య ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేసి, పాసైన విద్యార్థుల మార్కులను కూడా డబుల్ చేయాలని కోరారు. లేనిచో నిట్, ఎంసెట్ లాంటి పరీక్షల్లో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని, ఇంటర్ లో తక్కువ మార్కులు ఉంటే కొన్ని పరీక్షలకు అర్హతను కూడా కోల్పోయే ప్రమాదాన్ని గుర్తించి ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ కోరారు..లేదంటే ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల ఫలితాలను రద్దు చేసి రాయబోయే సెకండ్ ఇయర్ ఫైనల్ మార్కుల ఆధారంగా మార్కులను ఇవ్వడం ద్వారా మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందనీ అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..