Thursday, May 16, 2024

TS | పీడన, దోపిడీ పెరిగితే, దైవాంశ సంభూతులు పుడతారు.. అల్లూరి జయంతిలో సీఎం కేసీఆర్​

ప్రజలమీద పీడన, దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో దైవాంశ సంభూతులు పుడతారని ‘‘సంభవావి యుగే యుగే ’’ అని గీతాచార్యుడు చెప్పిన మాటలు, 26 ఏండ్ల అతిపిన్న వయస్సులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి నిజంగా వర్తిస్తాయని సీఎం కేసీఆర్​ అన్నారు. స్వేచ్ఛావాయువులు పీల్చుతూ స్వయం పాలన కోసం సాగిన స్వాతంత్ర్య  పోరాటంలో అల్లూరి గొప్ప  స్పూర్తిని రగిలించారని అన్నారు. అల్లూరి స్పూర్తిని తెలిపే గీతాలను వింటూ తాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో స్పూర్తిని పొందానని అన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో పోరాడి అసువులు బాసిన భగత్ సింగ్ వంటి గొప్ప వీరుల సరసన తెలుగునేల మీదనుంచి అల్లూరి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని కేసీఆర్​ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల నిర్వాహకులయిన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులను సీఎం కేసీఆర్ వేడుకల ముగింపు సందర్భంగా అభినందించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఇవ్వాల (మంగళవారం) జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ గౌరవ అతిథిగా అటెండ్​ అయ్యారు. ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్రపతికి మంగళవారం ఉదయం హకీం పేటలో కేసీఆర్ స్వాగతం పలికారు. సాయంత్రం గచ్చిబౌలీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రపతిని తో పాటుగా హాజరయ్యారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోడురాగా రాష్ట్రపతితో కలిసి వేదిక వద్దకు సీఎం కేసీఆర్​ చేరుకున్నారు.

క్షత్రియ సేవా సమితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు వేడుకల కార్యక్రమం ఆద్యంతంగా సాగింది. సమావేశం సాగినంత సేపు అల్లూరి వీర గాథను స్పురింపచేసే కార్యక్రమాలు డాక్యుమెంటరీలు సభికుల్లో దేశభక్తి భావాన్ని రగిలించాయి.  తొలుత  వేదికకు చేరుకుంటున్న సీఎం కేసీఆర్ కు సభికులు హర్హధ్వానాలతో, చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమ నిర్వాహకులు సీఎం కేసీఆర్​ని సాదరంగా స్వాగతించారు.

రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా అతిథులంతా రాష్ట్రపతి రాకకుముందే వేదికపైకి చేరుకున్నారు.   అక్కడే ఏర్పాటు చేసిన అల్లూరి చరిత్రను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వేదిక మీదికి చేరుకున్నారు. వారి రాకసందర్భంగా స్వాగతం పలుకుతూ హాలంతా చప్పట్లతో మారుమోగింది. అనంతరం  ఇతర ముఖ్య అథితులతో పాటు సీఎం కేసీఆర్ జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజల్వన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం – ముఖ్యాంశాలు

•             సీతారామరాజు గారి 125 వ జయంతుత్సవాల సందర్భంగా అందరికీ నమస్సులు.

•             “ పరిత్రాణాయ సాధూనాం..వినాశాయ చ దుష్కృతామ్..ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ”

అని భగవద్గీతలో  చెప్పినట్టు…ఎక్కడైతే పీడన, దోపిడి ప్రజల మీద ఎక్కువగా పెరుగుతుందో అక్కడ దైవాంశసంభూతులైన మహామహులు ఉద్భవించి పీడనకు కారకులైన వారిని అంతం చేసి, శాంతి కలుగజేస్తారని భగవద్గీత సందేశం.

•             బ్రిటిష్ బానిస బంధాల్లో చిక్కుకొని భరతజాతి నలిగిపోతున్న వేళ విప్లవజ్యోతియై అవతరించిన వీరయోధుడు అల్లూరి సీతారామరాజు.

•             అన్నెం పున్నెం ఎరుగని మన్నెం బిడ్డల కన్నీరు తుడిచి, గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహాయోధుడు అల్లూరి.

•             ఆయన భారతమాత గర్వించే ఉత్తమ తనయుడూ, నిర్మల దేశభక్తుడూ, నిజమైన యోగిపుంగవుడూ.

•             ఆ మహనీయుని 125 వ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించటం యావజ్జాతి కర్తవ్యం.

•             ఆ కర్తవ్యాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన తెలంగాణ – ఆంధ్ర క్షత్రియ సేవా సమితిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

•             ఈ ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు పోరాట చైతన్యాన్నీ, దేశభక్తినీ  కొత్త తరానికి ఘనంగా చాటిచెప్పాయని విశ్వసిస్తున్నాను.

•             నేడు మాననీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం ముదావహం. సముచితం.

•             ఈ సందర్భంగా మీరు కూడా తప్పకుండా రావాలని క్షత్రియ సేవా సమితి వారు నన్ను ఆహ్వానించారు. ఇంతటి ఉత్తమోత్తమమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగింది.

•             కార్యక్రమ నిర్వాహకులు నాగరాజు గారు చెప్పినట్టు, కృష్ణగారు అల్లూరి సీతారామ రాజుగారు సినిమా నిర్మించి ఉండకపోతే, అందులో మహాకవి  శ్రీశ్రీ  రాసిన “తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా ! మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా” అనే పాట చాలా పాపులర్ అయింది. అల్లూరి ప్రేమికులందరూ కూడా ఈ పాట నిరంతరంగా వింటూనే ఉంటారు. ఉద్యమ సందర్భంలో చాలాసార్లు నా కారులో ఈ పాట పెట్టుకొని వినేవాడిని.

•             మార్జినలైజ్డ్ సెక్షన్స్ మీద ఎప్పుడైతే దాడి సంభవిస్తుందో, అప్పుడు కొందరు వీరులు ఉద్భవించి వారికి శాంతి కలుగజేస్తారు.

•             చాలా గొప్ప చరిత్ర అల్లూరిది. చాలా చిన్న వయసులో అంత గొప్ప ప్రేరణ వారికి ఎలా కలిగిందో, అందుకే ఆయన దైవాంశసంభూతుడు అని నేను చెప్పాను. అంత పిన్న వయసులో వారు ప్రజలు పడే బాధలు భరించలేక వారు యుద్ధరంగంలోకి దూకి, 26 సంవత్సరాల కాలంలోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్న గడగడలాడించిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి యోధుల సరసన, మేము తక్కువ కాదు అని మన తెలుగు జాతిని నిలబెట్టిన మహానీయుడు అల్లూరి సీతారామరాజు గారు. మేము తక్కువ కాదని నిరూపించిన వారి త్యాగనిరతి, చివరికి చనిపోతూ కూడా దేశం గురించే మాట్లాడి, దేశం గురించే ప్రాణాలర్పించారు.

•             ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే, వేలకొద్దీ సీతారామరాజులు వస్తారని, ఇది ఆగే పోరాటం కాదనే అల్లూరి సీతారామరాజు  మాటలను  మిత్రుడు కిషన్ రెడ్డి గారు బాగా చెప్పారు.

•             మన త్రివర్ణ పతాకం గగనంలో రెపరెపలాడుతుంటే చాలా గొప్పగా దేశమంతా పరవశించిన సన్నివేశం మనం ఎప్పుడూ మరిచిపోలేం.

•             మహాత్మగాంధీ గారు అహింసా సిద్ధాంతాన్ని ప్రవచించినా, అల్లూరి సీతారామరాజు గారిని నేను ప్రశంసించకుండా ఉండలేను అని ఇచ్చిన స్టేట్ మెంట్ రికార్డుల్లో ఉంది. అటువంటి మహానీయుడు చేసిన పోరాటం వల్ల మనం ఈ  రోజు గౌరవంగా, సమున్నతంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నాం.

•             ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతుత్సవాలను చేపట్టి, వారికి తగిన గౌరవాన్ని కల్పించిన మిత్రులు కిషన్ రెడ్డిగారికి, కేంద్ర ప్రభుత్వానికి తెలుగుజాతి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. గర్విస్తున్నాను.

•             జై భారత్..

అంటూ తన ప్రసంగాన్ని సిఎం కేసీఆర్ ముగించారు.

ఈ సందర్భంగా… సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దామోదర్ రావు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, జాజల సురేందర్,పెద్ది సుదర్శన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, కాలె యాదయ్య, మర్రి జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కె. నవీన్ కుమార్ , శంభీపూర్ రాజు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, చైర్మన్లు డా. అంజనేయ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, , బిఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు., రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనికుమార్, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement