బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి వీడకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు, నదులు మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తడంతో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక.. తెలంగాణలో ఇవ్వాల (శుక్రవారం) అత్యంత భారీ వర్షపాతం నమోదైన జిల్లాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.09 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా జగిత్యాల జిల్లా తిరుమల గిరిలో 7.65 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
కాగా తెలంగాణలో అత్యంత భారీ వర్షపాతం నమోదైన జిల్లాల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కరీంనగర్ జిల్లా పోచంపల్లి 13.68 సెం.మీ, మహబుబాబాద్ జిల్లా గూడూరు 11.93, భద్రాద్రి కొత్తగూడెం లక్షీదేవిపల్లి 11.15, నారాయణపేట జిల్లా గుండుమల్ 9.68, సంగారెడ్డి జిల్లా మునిపల్లి 8.73, కరీంనగర్ ఆర్నకొండ 8.68. జగిత్యాల జిల్లా పూడూరు 8.65, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ 8.60, నిజామాబాద్ జిల్లా కోటగిరి 8.40, కరీంనగర్ జిల్లా ఏదులగుట్టపల్లి 8.30, మహబుబాబాద్ జిల్లా దంతాలపల్లి 8.10, కరీంనగర్ జిల్లా గంగాధర 8.08, రంగారెడ్డి జిల్లా ఆరుట్ల 7.85 ఉన్నాయి.