Sunday, April 28, 2024

మంచు ఖండంపై గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ జెండా.. మరింత చిత్తశుద్ధితో పనిచేస్తామ‌న్న‌ ఎంపీ సంతోష్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పర్యావరణ హితాన్ని కోరుతూ దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపే లక్ష్యంగా పని చేస్తోన్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యావరణం కాపాడటమే లక్ష్యంగా కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు పాటుపడాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వాలంటీర్‌కు చోటు దక్కింది. 35 దేశాల నుంచి 150 మంది సభ్యులతో కూడిన బృందం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు, ఎదురయ్యో సవాళ్ళపై అధ్యయనం చేస్తుంది.

ఈ పర్యటనలో భాగంగా భూగోళంతో పాటు అంటార్కిటికా ఖండంలో పర్యావరణం కాపాడాలని ఉద్యమం చేపట్టిన రాబర్ట్‌ స్వాన్‌ను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వాలంటీర్‌ కలిశారు. గత ఐదేళ్ళుగా చేపట్టిన కార్యక్రమాలు, భారత దేశ వ్యాప్తంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమం విస్తరిస్తున్న తీరును వివరించారు. చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రశంసించిన రాబర్డ్‌ స్వాన్‌ స్వయంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు.

ఈ సందర్భంగా అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న వాలంటీర్‌ అభిషేక్‌ శోభన్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ అభినందించారు. ట్విట్టర్‌ వేదికగా రాబర్డ్‌ స్వాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు ధృవాలను సందర్శించిన పర్యావరణవేత్త రాబర్డ్‌ స్వాన్‌ చేతుల మీదుగా అంచార్కిటికాలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ పతాకం ఆవిష్కరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఎంపీ సంతోష్‌ కుమార్‌ వెల్లడించారు. మరింత చిత్తశుద్దితో తమ పర్యావరణ ఉద్యమం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement