Friday, May 3, 2024

స్టడీ కోసం ఫారెన్​ వెళ్లి పాడుపని.. బ్రిటన్​లో కేరళ స్టూడెంట్​ అరెస్ట్

ఉన్నత విద్యకోసం బ్రిటన్​కు వెళ్లిన ఓ విద్యార్థి స్వయంకృతాపరాధంతో ఓ కేసులో ఇరుక్కున్నాడు. అక్కడ చదువుతున్న భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్న పిల్లలను వేధించిన కేసులో కేరళకు చెందిన విద్యార్థిని అరెస్టు చేసినట్లు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) పోలీసులు తెలిపారు. కేరళలోని కొట్టాయం జిల్లా రామాపురం ప్రాంతానికి చెందిన 24ఏళ్ల యువకుడు బ్రిటన్ బాలల సంరక్షణ బృందం జరిపిన స్టింగ్​ ఆపరేషన్​లో పట్టుబడ్డాడు.

చదువుకోసం వెళ్లిన కేరళకు చెందిన వ్యక్తి ఆ పనిలో ఉండక.. సెక్స్​ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేశాడు. ఈ క్రమంలో పరిచయమైన 14 ఏళ్ల బాలికను సంప్రదించాడు. కాగా, సోషల్​ మీడియాలో యువతులపై ఆరా తీస్తున్న వారిని పట్టుకోవడం కోసం బాలల సంరక్షణ బృందం రూపొందించిన ప్రొఫైల్​ గురించి అతనికి తెలియదు. ఈ క్రమంలో ఓ బాలికను ప్రలోభ పెట్టిన తర్వాత ఆ యువకుడు లండన్ లోని ఓ హోటల్ కు తీసుకెళ్లేందకు ప్రయత్నించాడు. అతను లూటన్ లోని తన ఇంటి నుంచి దాదాపు గంటసేపు ప్రయాణించి ఆ అమ్మాయి బస చేసిన హేమెల్ హెంప్ స్టెడ్ కు చేరుకున్నాడు.

అయితే.. అప్పటికే అతడిని ట్రేస్ చేసిన బాలల సంరక్షణ బృందం, పోలీసులు అక్కడికి చేరుకుని నిఘా వేసి పట్టుకున్నారు. చదువుకుంటూ.. కేర్ టేకర్ గా పనిచేస్తున్న ఆ యువకుడు ఈ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇది తెలిసి ముందు అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడని.. చివరకు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 15లక్షలు వెచ్చించి యూకేలో చదువుకునేందుకు వచ్చానని.. అనుకోకుండా పొరపాటు జరిగిందని యువకుడు పోలీసులకు తెలియజేశాడు. అయితే ఇవేమీ పట్టించుకోని పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అతనిని స్వదేశానికి పంపించనున్నారు. బాలల సంరక్షణ బృందం సృష్టించిన మరో రెండు ప్రొఫైల్ లలో కూడా అతను చాట్ చేస్తున్నాడని అధికారుల బృందం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement