Monday, May 20, 2024

కామారెడ్డిలో అమానుష ఘటన.. పెళ్లి భోజనం పెట్టలేదని కుటుంబం బహిష్కరణ

కామారెడ్డి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధలో ఉన్న ఆ కుటుంబానికి.. పెళ్లి భోజనం పెట్టలేదన్న సాకుతో కుల బహిష్కరణ చేశారు. వారి వేధింపులను తట్టుకోలేకపోయిన కుటుంబం ఇంటికి తాళం వేసి నిరసన చేపట్టింది. వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన యెల్ది పోశయ్య కూతురు ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. అయితే కూతురు వెళ్లిపోయిందన్న బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని కులపెద్దలు మానసికంగా వేధింపులకు గురి చేశారు. కూతురి పెళ్లి జరిగింది కాబట్టి కులస్తులందరికీ భోజనాలు పెట్టాలంటూ హుకుం జారీ చేశారు.

పెళ్లి వరుడి ఇంట్లో జరిగింది కాబట్టి కులాచారం ప్రకారం వాహన ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూతురు తమకు చెప్పకుండా వెళ్లిపోయిందని, అలాంటిది పెళ్లి భోజనం ఎలా పెట్టాలని పోశయ్య ప్రశ్నించారు. దీంతో కులపెద్దలకు ఆగ్రహం కలిగించింది. దీంతో అతడి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలో జరిగే శుభ, అశుభ కార్యాలకు పోశయ కుటుంబాన్ని ఏడాదిపాటు పిలవకూడదని కులపెద్దలు ఆదేశాలు జారీచేశారు. ఎవరైనా తమ ఆదేశాలు అతిక్రమిస్తే వారికి రూ10వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన పోశయ్య కుటుంబసభ్యులు ఆదివారం ఇంటి ముందు కూర్చుని నిరసన చేపట్టారు. ఇన్ని అవమానాలు భరించడం కన్నా ఆత్మహత్య చేసుకోవడమే మేలని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement