Friday, May 3, 2024

చిన వెంక‌న్న‌స్వామికి ‘బంగారు ఊయ‌ల‌, పాదుక‌లు’ – భారీ విరాళ‌మిచ్చిన భ‌క్తుడు

ద్వార‌కా తిరుమ‌ల‌లోని చిన‌ వెంక‌న్న‌స్వామికి ఓ భ‌క్తుడు భారీ విరాళాన్ని ఇచ్చాడు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని చిన్నవెంకన్నస్వామికి ఓ భక్తుడు బంగారు ఊయలను కానుకగా ఇచ్చారు. కళ్లు మిరుమిట్లు తొలిపే దగదగలతో పసుపు వర్ణంలో ఆ బంగారు తూగుటుయ్యాల మెరిసిపోయింది. ఉయ్యాలపై బంగారు నెమళ్లతో చెక్కబడి అత్యంత రమణీయంగా కనువిందు చేసింది. హనుమాన్‌ జంక్షన్‌కు చెందిన పర్వతనేని పాండురంగారావు అనే భక్తుడు 17 లక్షల రూపాయల వ్యయంతో బంగారు పూతతో చేయబడిన ఊయలతో పాటు బంగారు పాదుకలను వెంకన్నకి సమర్పించుకున్నారు. ముందుగా వాటిని ఆలయ జంట గోపురాల వద్దనుండి అనివెట్టి మండపం మీదుగా తూర్పు రాజ గోపురం నుండి ప్రదానాలయంలోకి తీసుకువచ్చారు. అక్కడ ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి బంగారు ఊయలను, పాదుకలను స్వామివారికి సమర్పించారు. అనంతరం దాత పాండురంగారావు స్వామి అమ్మవార్లను దర్శించుకున్ని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. “పెద్దతిరుపతి”లో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును “చిన్నతిరుపతి”లో తీర్చుకున్నా అదే ఫలం లభిస్తుంది. కాని చిన్నతిరుపతిలో తీర్చుకోవడానికి మ్రొక్కిన మ్రొక్కును చిన్నతిరుపతిలోనే తీర్చుకోవాలని స్థానికంగా భక్తుల నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement