Friday, April 26, 2024

పేదరికం వల్ల చాలా ఇబ్బందులు పడ్డా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పేదరికం వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చిన్నతనంలో తాను ఆకలిని చంపుకుని చదువుకున్నానని వెల్లడించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లోగల రమాదేవీ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆమె భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరికి పీహెచ్‌డీ, 22 మందికి పసిడి పతకాలు అందజేశారు.అనంతరం ఆమె ప్రసంగించారు. రమాదేవీ వర్సిటీలో చదువుకున్న రాష్ట్రపతి తన చిన్ననాటి పరిస్థితులు గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.

మయూర్‌భంజ్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామం నుంచి చదువు నిమిత్తం భువనేశ్వర్ చేరుకున్నానన్నారు. వేరుశనక్కాయలు తినాలని ఉన్నా..పావలా మిగుల్చుకునేందుకు ఆకలిని చంపుకున్న రోజులు ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం మహిళలు పురుషులతో సమానంగా దూసుకెళ్లడం సంతోషకరమని చెప్పారు. పార్లమెంటులో ప్రస్తుతం 115 మంది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ప్రతి రంగంలోనూ సత్తాచాటుతున్నారని చెప్పారు. చరిత్రలో సుస్థిరస్థానం సంపాదించుకున్న వీరనారీమణుల స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement