Saturday, May 4, 2024

కొత్త‌గా 6వేల క‌రోనా కేసులు.. పుట్టుకొస్తున్న కొత్త వైర‌స్ లు

కొత్త‌గా 6వేల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.ఇండియాలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 1,78,533 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఏకంగా 6,050 కేసులు బయటపడ్డాయి. ఇది నిన్నటితో పోలిస్తే 13 శాతం ఎక్కువ. గురువారం దేశంలో 5,335 కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,47,39,769కి చేరింది. మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 28,303 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

నిన్న ఒక్కరోజే 3,320 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,41,85,858కి చేరింది. ఇక గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్‌ కారణంగా 14 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి ఎగబాకింది.ప్రస్తుతం దేశంలో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల ( 220,66,20,700) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరగడానికి ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కారణమై ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతున్న కొద్దీ ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement