తెలంగాణ మరోసారి దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. నిన్నటి వరకూ ఢిల్లి లిక్కర్ స్కామ్ పతాక శీర్షికల్లో నిలిచింది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ, టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ వార్తలు ఊపేస్తున్నాయి. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు బండి సంజయ్ అరెస్ట్ కావడంతో రాజకీయ విభేదాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ తెలంగాణ వైపు మళ్లింది. మోడీ రాక సందర్భంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగాలని ఇప్పటికే భారాస శ్రేణులకు ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. మరోవైపు ప్రధాని కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. కాగా, భాజపా నేతలు పలువురికి, ఈటలతో సహా, ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపిస్తున్నారు. మోడీ పర్యటనలో శ్రేణులను సమాయత్తం చేసే నేతలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్ కావడాన్ని భాజపా అధిష్టానం సీరియస్గా తీసుకుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పర్యటనలో ప్రధాని మోడీ ఏయే విమర్శనాస్త్రాలు సంధిస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సుదీర్ఘ విచారణానంతరం గురువారం రాత్రి ఎట్టకేలకు బండి సంజయ్కు బెయిల్ మంజూరు కావడంతో భాజపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మోడీ పర్యటనను
విజయవంతం చేసి భారాసకు గట్టి సమాధానం చెప్పటానికి సమాయత్తమవుతున్నారు…
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: గత వారం పది రోజులుగా తెలంగాణ రాజకీయం ఊహించనంతగా వేడెక్కింది. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే బయటపడ్డ టీఎస్పీఎస్సీ, పదో తరగతి పరీక్షల పేపర్ల లీక్ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. అది కాస్త అధికార బలాబలాలు నిరూపించుకునే స్థాయికి వెళ్ళి పోయింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన ఖరారుకావడంతో రెండు పార్టీలూ వ్యూహ, ప్రతి వ్యూహాలతో సంసిద్ధమయ్యాయి. మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎక్కడిక్కడ నిరసనలు తెలుపుతూ ప్రధాని పర్య టనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునివ్వడం రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తోంది. రకరకాల పద్ధతుల్లో ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఆ పార్టీ నాయకులు, కార్య కర్తలు సిద్ధమవుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న పరిణా మాలు రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది.
బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు వ్యవహా రాన్ని అటు భాజపా అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏ క్షణంలో ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆందో ళన ఇరు పార్టీల నాయకుల మధ్య మసులుతోంది. రకరకాల కారణాల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో వ్యూహమంతా ఆయా పార్టీల కేడర్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనను అడుగడుగునా అడ్డుకునే కార్యక్ర మాన్ని బీఆర్ఎస్ రాజకీయ వ్యూహంగా పరిగణిస్తోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు ప్రణాళిను సిద్ధం చేశారు. హైదరాబాద్తో పాటు మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రా ల్లో మహా ధర్నాలు నిర్వహించేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో బీఆర్ఎస్ కార్య కర్తలు ఉవ్వెత్తున నిరసనలకు సమాయత్తమ వుతున్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగే ప్రధాని బహిరంగ సభలోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు చొరబడి ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సింగరేణి ప్రైవేటీ-కరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కేడర్ అంతర్గత కసరత్తు చేస్తోంది.
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసనల ప్రణాళిక
దాదాపు రెండేళ్ళ తర్వాత హైదరాబాద్ వస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా భారీగా ప్లెక్సీలను ఏర్పాటు చేసి ఉవ్వెత్తున నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్వీ కార్యకర్తలు రంగంలోకి దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా హోర్డింగ్లతో పాటు- గోడలపై పోస్టర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ”బీజేపీలో చేరకముందు, బీజేపీలో చేరిన తర్వాత” అంటూ.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బీజేపీలో చేరిన కొందరు నేతల ఫొటోలతో ఈ పోస్టర్లు సిద్ధం చేస్తున్నారు. పోస్టర్లలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి, ఏపీకి చెందిన ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణ తదితరుల ఫొటోలతో ఫ్లెక్సీలు సిద్ధమవుతున్నట్లు తెలు స్తోంది. వీరంతా సీబీఐ, ఈడీ సోదాల తర్వాత బీజేపీలో చేరా రని పరోక్ష సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాలన్న ప్రయత్నంలో భాగంగానే వీటిని తయారు చేయిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారో కోలకు ప్లాన్ చేస్తున్నారు. ”నిజమైన రంగులు వెలసిపోవు” అనే కొటేషన్తో పాటు-.. ”బై బై మోడీ” అంటూ హాష్ టాగ్లు ఏర్పాటు- చేసేందుకు పార్టీ నాయకులు ప్రత్యేక వ్యూహంతో ఉన్నారు.
రెండేళ్ళ నుంచీ రగులుతున్న వ్యవహారం
ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ సడన్గా ప్రధాని పర్యటన రోజే ఆందోళనకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గతంలోనూ బీఆర్ఎస్ ఇలానే వ్యవహరిచిందని, గతేడాది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించిన సందర్భంలో బీజేపీ, బీఆర్ఎస్లు పోటాపోటీ- సభలు నిర్వహించాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఆ సమయంలో ప్రధాని మోడీ మీటింగ్ కంటే ముందే యూపీఏ భాగస్వామపక్షాల రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి ఆహ్వనించడం, ఆయన్ను స్వయంగా సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈసారి కూడా ఇదే వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. పోటాపోటీ- కార్యక్రమాల ద్వారా బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న మూడ్ను డైవర్ట్ చేసేందుకు అధికార పార్టీ వ్యూహం పన్నిందనే చర్చ జరుగుతోంది.
అడుగడుగునా ప్రధానికి స్వాగత తోరణాల ఏర్పాటు
ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగ డుగునా స్వాగత తోరణాలతో ఆహ్వానించేందుకు పార్టీ నగరశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు వేశారు. మోడీ రాక సందర్భంగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో, ముఖ్యంగా బహిరంగ సభ ప్రాంగణానికి వెళ్ళే దారిలో భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.