Monday, April 29, 2024

Corona: చైనాలో మ‌ళ్లీ డేంజర్ బెల్స్

Coronavirus: డ్రాగన్ కంట్రీని కరోనా మళ్లీ వణికిస్తోంది. చైనాలో వైరస్ తీవ్రత రోజురోజుకూ విస్తరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పలు నగరాలు, పట్టణాల్లో కొవిడ్ వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది చైనా స‌ర్కారు.

స్కూళ్లు, కాలేజీలు మూసివేయడమే కాకుండా.. వందల సంఖ్యలో విమానాలను రద్దు చేసింది డ్రాగ‌న్ కంట్రీ. ఇక వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భారీ స్థాయిలో కొవిడ్‌ టెస్టులు, కాంటాక్టు ట్రేసింగ్ వంటివి చేయడం ప్రారంభించింది.

ఈ మ‌ధ్య షాంఘై నుంచి షియాన్‌, గున్సూ, ఇన్నర్‌ మంగోలియా ప్రావిన్సుల్లో ఓ వృద్ధ జంట పర్యటించింది. వారిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో అధికారులు వారి కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి టెస్టులు చేయగా డజన్ల కొద్దీ కేసులు బయటపడుతున్నాయి.

నిన్న‌ ఒక్కరోజే 13 పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. ఇలా ఒక్కసారిగా కొవిడ్‌ వ్యాప్తి మొదలు కావడంతో అప్రమత్తమైన అధికారులు భారీ స్థాయిలో క‌రోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.

కొవిడ్‌ తీవ్రత మ‌ళ్లీ పెర‌గ‌డంతో చైనాలోని పర్యాటక ప్రాంతాలు, స్కూళ్లు మూసివేశారు. వేడుకలపై నిషేధం విధించారు. కేసులు బయటపడిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దాదాపు 40లక్షల జనాభా కలిగిన లాన్‌జువో ప్రావిన్సుతో పాటు సమీప ప్రాంతాల ప్రజలను అవసరమైతే తప్ప ఇంటినుంచి బయటకు రావద్దని ఆదేశించారు.

- Advertisement -

కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో బయటకు అనుమతిస్తున్నారు. ఇన్నర్‌ మంగోలియాలోని పలు ప్రాంతాల్లోనూ సిటీ నుంచి రాకపోకల‌పై నిషేధం అమ‌ల్లోకి తెచ్చారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement