Sunday, May 5, 2024

దేశంలో కరోనా డేంజర్ బెల్స్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్నది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మరణాలు సైతం భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,480 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 41,280 మంది కోలుకోగా.. వైరస్‌ ప్రభావంతో 354 మంది మృత్యువాత పడ్డారని కేంద్రం పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,21,49,335కు చేరింది.

ఇప్పటి వరకు 1,14,34,301 మంది కోలుకోగా.. మొత్తం 1,62,468 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,52,566 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. టీకా డ్రైవ్‌లో భాగంగా 6,30,54,353 డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశంలో 10,22,915 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పేర్కొంది. మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 24.36 కోట్ల శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.

ఇక తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా  684 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 394 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,889 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,965 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,873 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 184 మందికి క‌రోనా సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement