Friday, May 3, 2024

ట్రాఫిక్ చలాన్ల రాయతీ అమలు.. డిస్కౌంట్‌కు విశేష స్పంద‌న.. నిమిషానికి 700 పెండింగ్ చ‌లాన్లు క్లియ‌ర్

తెలంగాణలో పెండింగ్ చ‌లాన్ల క్లియ‌రెన్స్ ప్రారంభ‌మైంది. వాహ‌నాల పెండింగ్ చ‌లాన్ డిస్కౌంట్‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ప్ర‌తి నిమిషానికి 700 పెండింగ్ చ‌లాన్ల‌ను వాహ‌న‌దారులు క్లియ‌ర్ చేస్తున్నారు. ఆన్‌లైన్, ఈ-చ‌లాన్ వెబ్‌సైట్ ద్వారా పెండింగ్ చ‌లాన్ల‌ను క్లియ‌రెన్స్ చేస్తున్నారు. ఈ చలాన్ల వెబ్‌సైట్‌ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్ అందుబాటులోకి వ‌చ్చింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై ఉన్న పెండింగ్‌ చలాన్లపై 75శాతం మాఫీ చేయగా.. 25శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్‌ మోటార్‌ వేహికిల్‌, హెవీ మోటార్‌ వాహనాలకు 50శాతం, తోపుడు బండ్లకు 75శాతం, నో మాస్క్‌ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నారు.  నేటి నుంచి మార్చి30 వరకు పెండింగ్ చలానాలు చెల్లించేందుకు ప్రత్యేక అవకాశం కల్పించింది. బైక్‌లు, కార్లు, లారీలు, ఆటోలపై ఫైన్లను రాబట్టేందుకు భారీ ఆఫర్లు ఇచ్చింది. చలాన్ల చెల్లింపుల కోసం గంటల తరబడి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లలో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే చలానాలు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ఈ-చ‌లాన్ ద్వారా అన్ని పెండింగ్ చ‌లాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చ‌లాన్ల చెల్లింపున‌కు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవ‌ల‌ను కూడా ఉప‌యోగించుకోవ‌చ్చని సూచించారు. అటు మీ సేవ‌, ఈ సేవ‌లో కూడా చలానాలు చెల్లించేలా అవకాశం కల్పించారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్‌ చలాన్లపై రాయితీని ప్రకటించింది. హైదరాబాద్‌లో లక్షా 75 వేల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వాహనదారులు దాదాపు 5 వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు ఈ అవకాశం ఉంటుందని పోలీసులు చెప్పారు.

హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు రూ.600 కోట్లు ఉన్నాయి. మరో రెండు సిటీ కమిషనరేట్లు, సైబరాబాద్, రాచకొండలను కలుపుకుంటే పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు రూ.1000 కోట్లకు పైగానే ఉంటాయి. తొలుత హైదరాబాద్ నగరంలో ప్రారంభించి తదుపరి దశల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement