Saturday, April 27, 2024

పరీక్షలతో కలిగే ప్రయోజనం..టీచర్లు గుర్తించాలి!

విద్యార్థుల భవిష్యత్తు కోసమే టెన్త్, ఇంటర్‌ పరీక్షల నిర్వహిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు.  పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదని, నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసిందని తెలిపారు. దాంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. నాడు–నేడు మనబడిపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు మనబడి మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిని సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. పనులు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయన్న అధికారులు, ఆ వివరాలను ప్రజెంటేషన్‌లో చూపారు.  ఈ సందర్భంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణను కూడా సీఎం జగన్‌ ప్రస్తావించారు.

పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తున్నాయని సీఎం అన్నారు. అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని, అలాంటప్పుడు మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయన్నారు. పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా. కేవలం పాస్‌ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిజానికి పరీక్షల రద్దు చేయడం చాలా సులభం, పరీక్షల నిర్వహణ ఇంకా బాధ్యతతో కూడుకున్నదని చెప్పారు. విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామన్న విషయాన్ని ప్రతి టీచర్‌ గుర్తించాలని సీఎం కోరారు. ఇందులో అందరి సహాయ సహకారాలు కావాలన్నారు. పరీక్షల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

రూపురేఖలు మార్చుకుంటున్న స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్‌పై కూడా పెయింటింగ్స్‌ వేయాలని సీఎం సూచించారు. నాడు- నేడు పనులు పూర్తయ్యాక, ప్రతి స్కూల్‌లో నాడు ఆ స్కూల్‌ ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉంది అన్న ఫోటోలు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. స్కూళ్లలో పెయింటింగ్‌ పనులు, స్మార్ట్‌ టీవీలు, వాల్‌ ఆర్ట్‌ తో సహా అన్ని పనులు తప్పనిసరిగా మే చివరి నాటికి పూర్తి కావాలని సీఎం ఆదేశించారు. పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదని, అందుకే పేరెంట్స్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేశామన్నారు. నాడు–నేడులో ప్రభుత్వం నిర్దేశించుకున్న విధంగా పనులు జరగాలని సూచించారు. మే, జూన్‌ నెలల్లో పూర్తిగా పనులు నాణ్యతను చూడాలని, ప్రతి స్కూల్‌ సందర్శించాలన్నారు. టాయిలెట్‌ నిర్వహణ వ్యవస్థ కూడా స్కూళ్లు తెరిచే నాటికి పూర్తి కావాలని సీఎం తెలిపారు.

ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. అప్పుడే వారు ఏ ఇబ్బంది లేకుండా ఇంగ్లిష్‌లో పాఠాలు చెప్పగలుగుతారని పేర్కొన్నారు. పిల్లలు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా రెడీ కావాలన్నారు. ఈసారి కిట్లలో ఇంగ్లిష్‌ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యా కానుక కింద ఇస్తున్న కిట్లలో ప్రతి ఒక్కటీ పూర్తి నాణ్యత కలిగి ఉండాలని,  జూలైలో స్కూళ్లు తెరవగానే, నాడు–నేడు మనబడి రెండో దశ పనులు మొదలు కావాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement