Sunday, May 5, 2024

TIMS: తెలంగాణలో వైద్య విప్లవం

తెలంగాణ వైద్యరంగ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్‌ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అల్వాల్‌ (బొల్లారం), సనత్‌నగర్‌ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), ఎల్బీనగర్‌ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌)లో టిమ్స్‌ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో అత్యవసరంగా ఏర్పాటైన గచ్చిబౌలి టిమ్స్‌ను ఆధునీకరించడంతోపాటు మిగతా మూడు టిమ్స్‌ అవతరించనున్నాయి. సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌లో జీ+14 విధానంలో దవాఖాన భవనాలు నిర్మిస్తారు.

అల్వాల్‌లో కంటోన్మెంట్‌ ప్రాంతం కావడంతోపాటు పక్కనే రాష్ట్రపతి నిలయం ఉండడంతో జీ+5 విధానంలో నిర్మాణం చేపడతారు. ఒక్కో టిమ్స్‌లో వెయ్యి పడకలు ఉంటాయి. అల్వాల్‌లోని రాజాజీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రాంగణంలో దవాఖాన నిర్మాణ స్థలాన్ని మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి ఆదివారం పరిశీలించారు. రాజీవ్‌ రహదారికి ఆనుకొని ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఈ టిమ్స్‌ను నిర్మించనున్నారు. సనత్‌నగర్‌, ఎల్బీనగర్‌ టిమ్స్‌ల నిర్మాణ స్థలాలను ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు శర్మన్‌, అమేయకుమార్‌ తదితరులు పరిశీలించారు. మూడు టిమ్స్‌ల కోసం ప్రభుత్వం రూ.2,679 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

వైద్యరంగంలో విప్లవం

‘తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్లే.. తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తరు. తెలంగాణ ప్రజల బాగుకోసం కష్టపడుతరు’.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పే మాట అక్షరాలా నిజం. ఇందుకు తార్కాణం తెలంగాణ రాష్ట్రమంతా వైద్యరంగ విస్తరణ. రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలైన గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడటానికి ముందే ప్రారంభమయ్యాయి. గాంధీ దవాఖాన 170 ఏండ్ల క్రితం మొదలుకాగా, ఉస్మానియాకు వందేండ్ల చరిత్ర ఉన్నది. చివరగా నిమ్స్‌ దవాఖాన హైదరాబాద్‌ రాష్ట్రంలో 1951లో ఏర్పాటైంది. 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకులు తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. దాదాపు 65 ఏండ్ల పాలనలో తెలంగాణలో ఒక్క సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన కూడా ఏర్పాటు చేయలేదు.

సీఎం కేసీఆర్‌, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన వెంటనే వైద్యరంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. పీహెచ్‌సీ నుంచి టీచింగ్‌ దవాఖానల వరకు అన్ని స్థాయిల్లో ఆధునిక వసతులు కల్పించారు. గాంధీ, నిమ్స్‌, ఉస్మానియాకు నిధులిచ్చి అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగలిగే స్థాయికి వసతులు సమకూర్చారు. జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున ఏర్పాటు చేస్తూ స్పెషాలిటీ సేవలను విస్తరిస్తున్నారు. కరోనా విపత్తు సమయంలో యుద్ధ ప్రాతిపదికన గచ్చిబౌలిలో 1,500 పడకలతో టిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను ప్రారంభించారు. వరంగల్‌లో రూ.1,100 కోట్లతో హెల్త్‌ సిటీ నిర్మాణం చేపట్టారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై ఒత్తిడి తగ్గించడంతోపాటు జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఎక్కడికక్కడ సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించేందుకు హైదరాబాద్‌ నలువైపులా టిమ్స్‌లు నిర్మిస్తున్నారు.

- Advertisement -

అందుబాటులో ప్రపంచస్థాయి వైద్యం

హైదరాబాద్‌లో టిమ్స్‌ల నిర్మాణంతో రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా, అత్యంత చేరువలో ప్రపంచ స్థాయి వైద్యం అందుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అల్వాల్‌ దవాఖాన నిర్మాణ స్థల పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నగర జనాభా, రాష్ట్ర జనాభా పెరిగిపోతున్నది. ప్రజల వైద్య అవసరాలు తీర్చేలా, నగరం నలువైపులా నాలుగు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. పేదల ఇబ్బందులు తొలగించేలా, నాణ్యమైన ఉచిత వైద్యం అందేలా టిమ్స్‌లు ఏర్పాటు కానున్నాయి. కరోనా సమయంలో ఏర్పాటుచేసిన గచ్చిబౌలిలోని టిమ్స్‌ గొప్పగా సేవలందిస్తున్నది. ఇప్పుడు మిగతా మూడు దిక్కులా టిమ్స్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. గ్రేటర్‌ ప్రజలతోపాటు, వివిధ జిల్లాల ప్రజలకు ఈ దవాఖానలు మెరుగైన, విలువైన వైద్య సేవలు అందిస్తాయి. వీటితో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువవుతుంది’ అని వెల్లడించారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వంటి సంక్షోభాలు వస్తే సమర్థంగా ఎదుర్కొనేలా సీఎం కేసీఆర్‌ అల్వాల్‌ (బొల్లారం)లో టిమ్స్‌ను నిర్మిస్తున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement