Sunday, April 28, 2024

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం.. రాష్ట్ర సమస్యలు ప్రస్తావించే ఛాన్స్!

హైదరాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్ది కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. అనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి రెండు హెలికాఫ్టర్లలో ఇక్రిశాట్ కు పీఎం మోడీ వెళ్తారు. మోడీతో పాటు సీఎం కేసీఆర్ కూడా ఛాపర్లో ఇక్రిశాట్ కు వెళ్లనున్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో 7 నిమిషాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ప్రధానితో పాటు ముచ్చింతల్ కు వెళ్తారు. రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు కేసీఆర్ ఆయన వెంటే ఉంటారు. రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 8.15 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ ప్రధానికి వీడ్కోలు పలుకుతారు.

మరోవైపు ఇటీవల కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహా కేంద్రం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఆసక్తి రేపుతోంది. సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి రాష్ట్ర సమస్యలు వివరిస్తారని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానితో నిధుల అంశాన్ని సీఎం కేసీఆర్‌ ప్రస్తావిస్తారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement