Friday, April 26, 2024

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పరస్పర బదిలీలకు సీఎం కేసీఆర్ అంగీకారం

తెలంగాణలో బదిలీలతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది. భార్యాభర్తలను ఒకే చోటుకు బదిలీ చేసేందుకు వచ్చిన వినతులు, బదలాయింపుల సందర్భంగా ఉద్యోగుల నుంచి వచ్చిన అభ్యంతరాలనూ వెంటనే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. దీనిపై గురువారం ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్‌ విధానం కింద తెలంగాణలో సుమారు 70 వేల మందికి పైగా ఉద్యోగుల బదలాయింపు జరిగింది. ఈ సందర్భంగా పలువురు భార్యాభర్తలైన ఉద్యోగులు బదిలీలను కోరారు. పనిచేస్తున్న చోటు కాకుండా వేరే జిల్లాలు, జోన్లు, మల్లీ జోన్లకు వెళ్లిన ఉద్యోగులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరికి అప్పీళ్లకు అవకాశం కల్పించడంతో దాదాపు మూడువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో సరైనవని భావించిన వాటినే అధికారులు పరిష్కరించి మిగిలినవి తిరస్కరించారు. భార్యాభర్తల బదిలీలకు సంబంధించి కొన్ని జిల్లాలకు మాత్రమే అనుమతించారు. రంగారెడ్డి, హైదరాబాద్‌‌తో పాటు పలు జిల్లాల్లో పట్టణ, నగర ప్రాంతాల్లోని పోస్టులకు అనుమతించలేదు.

ఈ నేపథ్యంలో టీఎన్జీవోల నేతలు బుధవారం సీఎస్‌ సోమేశ్‌ను సచివాలయంలో కలిశారు. బదలాయింపులపై వచ్చిన అప్పీళ్లను పరిష్కరించాలని, పరస్పర బదిలీలు వెంటనే చేపట్టాలని, ఒకేచోటుకు దంపతుల బదిలీలకు అనుమతించాలని కోరారు. ఉద్యోగ సంఘాల వినతులను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌.. సీఎం కేసీఆర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి పరస్పర బదిలీలకు అంగీకారం తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement