Saturday, May 18, 2024

బేగంపేట ఎయిర్‌పోర్టులో పౌర విమానయాన పరిశోధనా కేంద్రం.. మోడీకి థ్యాంక్స్.. కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నకేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కూడిన మరో పరిశోధనా సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO)ను రూ.400 కోట్లకు పైగా అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈమేరకు ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన పరిశోధనలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జులై నుంచి పరిశోధనలు ప్రారంభించడమే టార్గెట్‌గా భారతదేశంలో మొదటిసారి ‘గృహ-5’ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ కేంద్రంలో వివిధ రకాల పరిశోధనా సౌకర్యాలను కల్పించనున్నట్టు ఆయన వెల్లడించారు.

విమానాశ్రయాలు, ఎయిర్ నేవిగేషన్ సేవలకు సంబంధించిన పరిశోధనా సౌకర్యాలు, ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కమ్యూనికేషన్స్, డొమైన్ సిమ్యులేటర్స్, నెట్ వర్క్ ఎమ్యులేటర్, విజువలైజేషన్ & అనాలసిస్ ల్యాబ్స్, సర్వెలెన్స్ (నిఘా) ల్యాబ్స్, నావిగేషన్ సిస్టమ్స్ ఎమ్యులేషన్ & సిమ్యులేషన్ ల్యాబ్స్, సైబర్ సెక్యూరిటీ & థ్రెట్ అనాలసిస్ ల్యాబ్స్, డేటా మేనేజ్‌మెంట్ సెంటర్, ప్రాజెక్ట్ సపోర్ట్ సెంటర్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ & టూల్స్ సెంటర్, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ వంటి అనేక రకాల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధనా సౌకర్యాలను కలిగిన ఈ పౌర విమానయాన పరిశోధనా కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2023 డిసెంబర్‌లోగా ఈ కేంద్రం సేవలను ప్రారంభిచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని చెప్పారు. భారత పౌరవిమానయాన రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ పరిశోధనా కేంద్రాన్ని బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలంగాణ ప్రజల తరఫున కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement