Wednesday, May 15, 2024

Filmnagar Matters: చిల్​ గయ్స్​.. ఫేక్ న్యూస్‌ని ప‌క్క‌న‌పెట్టండి.. పూరి క‌నెక్ట్స్ ఫుల్‌ క్లారిటీ ఉందన్న చార్మీ

విజయ్ దేవరకొండ హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్ష‌న్‌లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫలితంగా సోషల్ మీడియా వేదికగా పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ విడిపోయారని రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది చార్మీ.

“ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు.. సోషల్ మీడియా నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాం. పూరి కనెక్ట్స్ తిరిగి వస్తుంది. ఈ సారి భారీగా, మరింత మెరుగ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అప్ప‌టిదాకా కూల్‌గా ఉండండి” అంటూ చార్మీ తన ట్విటర్ వేదికగా పోస్ట్ పెట్టింది. టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం. పూరి-చార్మి ఇద్దరూ విజయ్‌తో తీయబోయే పాన్ఇండియా ప్రాజెక్టు జనగణమనను నిలిపివేశారని వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా వీరిద్దరూ వ్యాపార భాగస్వాములుగా తమ దారులు తాము చూసుకున్నారని, పూరి జగన్నాథ్ కూడా ముంబయి నుంచి తన మకాం హైదరాబాద్‌కు మార్చారని సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూరూస్తూ సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నామని చార్మీ ప్రకటించడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో మరో ట్వీట్‌తో స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసిందీ ముద్దుగుమ్మ.

“రూమర్లు, రూమర్లు, రూమర్లు.. ఈ ఊహాగానాలన్నీ ఫేక్. పూరి కనెక్ట్స్ ఎలా పురోగతి చేయాలనే అంశంపై మేము ప్రస్తుతం దృష్టి పెట్టాం. అప్పటి వరకు ఈ పుకార్లను ఆపండి” అంటూ చార్మీ ట్విటర్ వేదికగా స్పష్టం చేసింది. చార్మీ ఇచ్చిన ఈ ప్రకటనతో పూరి జగన్నాథ్‌తోనే తన తదుపరి చిత్రం తీయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement