Thursday, May 2, 2024

తెలంగాణలో ఏడు కొత్త జోన్లు ఏర్పాటు!

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోలీసు నియ‌మాకాల‌కు మిన‌హాయించి.. మిగిలిన అన్ని విభాగాల‌కు ఈ జోన్ల విధానం వ‌ర్తిస్తుంది.

తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉండగా.. వీటి స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం, రాజన్న, బాసర, భద్రాద్రి , యాదాద్రి, చార్మినార్‌, జోగుళాంబ జోన్ లు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి, మంచిరాల్య, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు బాసర జోన్లో ఉంటాయి. రాజన్న జోన్‌‌లో కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఉంటాయి. వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు భద్రాద్రి జోన్లో ఉంటాయి. యాదాద్రి జోన్‌లో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు ఉంటాయి. చార్మినార్‌ జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు.. జోగుళాంబ జోన్‌లో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఉంటాయి.

వీటిలో తొలి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్‌ గా, తర్వాతి మూడు జోన్లను మరో మల్టీజోన్‌ గా పరిగణిస్తారు. ఇప్పటి వరకూ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లానే స్థానికతగా పరిగణిస్తారు. ఇక నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.

దేశంలో ఎక్కడా లేని రీతిలో స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం 70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించగా, 30 శాతం పోస్టులు ఓపెన్ కెటగిరీ పరిధిలోకి ఉంచేవారు. దీని వల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95 శాతం పోస్టులను స్థానికులకు కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం నూతన జోన్ల విధానానికి రూపకల్పన చేసింది. త్వ‌ర‌లో వెలువ‌డ‌బోయే నోటిఫికేష‌న్లు నూత‌న జోన‌ల్ విధానం ప్ర‌కారం భ‌ర్తీ చేయనున్నారు.

తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగడంతో జోన్ల వ్యవస్థను కూడా పునర్విభజించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు చెప్పారు. ఈ ప్రతిపాదనలపై 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి చర్చించారు. జోన్లు, మల్టీ జోన్లు ఖరారు చేశారు.

ఏడు జోన్ల వివరాలు:

———————–

1. కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి

2. బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల

3. రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్

4. భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్

5. యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా): సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ

6. చార్మినార్ జోన్(1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి

7. జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్

Advertisement

తాజా వార్తలు

Advertisement