Friday, April 19, 2024

నిరుద్యోగులకు శుభవార్త – కొత్త జోనల్ విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్…

హైద‌రాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దాఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోలీసు నియ‌మాకాల‌కు మిన‌హాయించి.. మిగిలిన అన్ని విభాగాల‌కు ఈ జోన్ల విధానం వ‌ర్తిస్తుంది. దేశంలో ఎక్కడా లేని రీతిలో స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. తెలంగాణలో నూతన జోనల్ వ్యవస్థను కేసీఆర్ స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న విధానం ప్రకారం 70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించగా, 30 శాతం పోస్టులు ఓపెన్ కెటగిరీ పరిధిలోకి ఉంచేవారు. దీని వల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95 శాతం పోస్టులను స్థానికులకు కల్పించేలా కేసీఆర్ సర్కారు నూతన జోన్ల విధానానికి రూపకల్పన చేసింది. త్వ‌ర‌లో వెలువ‌డ‌బోయే నోటిఫికేష‌న్లు నూత‌న జోన‌ల్ విధానం ప్ర‌కారం భ‌ర్తీ చేయ‌నున్నారు.

రెండు నుంచి ఏడు జోన్లగా విభజన….

తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉండగా.. వీటి స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి, మంచిరాల్య, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు బాసర జోన్లో ఉంటాయి.

రాజన్న జోన్‌‌లో కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఉంటాయి. వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు భద్రాద్రి జోన్లో ఉంటాయి. యాదాద్రి జోన్‌లో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు ఉంటాయి. చార్మినార్‌ జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు.. జోగుళాంబ జోన్‌లో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఉంటాయి. వీటిలో తొలి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్‌గా, తర్వాతి మూడు జోన్లను మరో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకూ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లానే స్థానికతగా పరిగణిస్తారు. ఇక నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement