Friday, April 26, 2024

BREAKING: ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీఎం జగన్‌ తోపాటు సీబీఐకి నోటీసులు ఇచ్చింది.  తదుపరి విచారణను మే 7న చేపట్టనున్నట్లు వెల్లడించింది.

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ​ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. సాక్షులను ముఖ్యమంత్రి జగన్ ప్రభావితం చేస్తున్నారని పిటిషన్‌ లో ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. కోర్టు విధించిన బెయిల్ షరతులు జగన్ ఉల్లంఘించారని.. రద్దు చేయాలని ఆయన పిటిషన్​లో కోరారు.

గతంలో సీబీఐ కోర్టులో వాదనలు జరిగినప్పుడు.. ఈ కేసులతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినప్పటికీ పిటిషన్ వేసే అర్హత ఉందని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి చార్జ్‌ షీట్‌లో జగన్ ఏ-1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు. రఘురామ జగన్‌ పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషన్‌లో ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement